దేశమంతా బెంగాల్‌కు అండగా ఉంది: ప్రధాని

21 May, 2020 14:39 IST|Sakshi

ఢిల్లీ : తీవ్ర ఉగ్రరూపం దాల్చిన పెను తపాన్‌ ‘ఉంపన్‌’ పశ్చిమ బెంగాల్,‌ ఒడిశా రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తోంది. తుపాన్‌ దాటికి అనేక ఇళ్లు నేలకొరిగాయి. భారీ వర్షాలు, తీవ్రమైన గాలుల కారణంగా సమాచార వ్యవస్థ, విద్యుత్‌ సరాఫరా నిలిచిపోయింది. ఈ తుపాన్‌ తీవ్రంగా మారటంతో పశ్చిమబెంగాల్‌లో 12 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో పెను తుపాన్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. దేశమంతా పశ్చిమబెంగాల్‌ అండగా నిలుస్తుందని ట్విటర్‌ ద్వారా పేర్కొన్నారు. పెను తుపాన్‌ ఉంపన్‌’ద్వారా నష్టపోయిన బాధితులకు సహాయం అందించడంలో ఏ విధంగానూ వెనుకాడమని స్పష్టం చేశారు. (కరోనా కంటే తీవ్రంగా ఉంది: మమతా బెనర్జీ)

‘ఉంపన్‌‌ తుపాన్‌ వల్ల సంభవించిన వినాశనాన్ని పశ్చిమ బెంగాల్‌ నుంచి విజువల్స్‌ చూస్తున్నాం. ఈ  కష్ట సమయంలో దేశమంతా పశ్చిమబెంగాల్‌కు అండగా ఉంటుంది. అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాం. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నాం. పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి’. అని ప్రధాని ట్వీట్‌ చేశారు. మరో ట్వీట్‌లో.. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో జాతీయ విపత్తు సహాయక బృందాలు పనిచేస్తున్నాయని ప్రధాని అన్నారు. స్థానికంగా పరిస్థితిని ఉన్నతాధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారని, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో సన్నిహిత సమన్వయంతో పనిచేస్తున్నామని ప్రధాని తెలిపారు. (గులాబీ రంగులో ఆకాశం.. నా సిటీ పూర్వస్థితికి!)

మరిన్ని వార్తలు