యువజన నైపుణ్య దినోత్సవం.. మోదీ ప్రసంగం

15 Jul, 2020 12:43 IST|Sakshi

5 కోట్లకు పైగా యువతలో నైపుణ్య అభివృద్ధి జరిగింది

సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ యువతను ఉద్దేశించి వీడియో ద్వారా ప్రసంగించారు. నేడు వేగంగా మారుతున్న ప్రపంచంలో, అనేక రంగాలలో మిలియన్ల మంది నైపుణ్యం గల వ్యక్తుల అవసరం ఉందని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఆరోగ్య సేవల్లో నైపుణ్యం గల వారి అవసరం అధికంగా ఉందన్ననారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తమ​ ప్రభుత్వం ‘స్కిల్ ఇండియా మిషన్‌’ను ప్రారంభించిందని తెలిపారు. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా వందలాది ప్రధాన మంత్రి నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు ప్రారంభించబడ్డాయన్నారు. ఐటీఐల సంఖ్యను పెంచామని, లక్షలాది కొత్త సీట్లను చేర్చామన్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 5 కోట్లకు పైగా యువతలో నైపుణ్య అభివృద్ధి జరిగిందని తెలిపారు.  నాలుగైదు రోజుల క్రితం దేశంలోని కార్మికుల కోసం ‘స్కిల్ మ్యాపింగ్ పోర్టల్’ని ప్రారంభించామని మోదీ తెలిపారు. (భారత్‌కు గూగుల్‌ దన్ను!)

మోదీ మాట్లాడుతూ.. నైపుణ్యం కలిగిన వ్యక్తులను, కార్మికులను మ్యాపింగ్‌ చేయడంలో ఈ పోర్టల్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించే సంస్థలు, ఈ పోర్టల్‌ ద్వారా నైపుణ్యం కలిగిన కార్మికులను ఒకే క్లిక్‌తో చేరుకోగలుగుతారని పేర్కొన్నారు. కరోనా వల్ల ఏర్పడిన ఈ సంక్షోభం ప్రపంచంలో అన్నిదేశాలలో సమానంగా ఉంటుందన్నారు. ఈ ప్రభావంతో ఉద్యోగ స్వభావం కూడా మారిందన్నారు. ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతికత కూడా ఉద్యోగులను ప్రభావితం చేస్తుందని తెలిపారు. చిన్న, పెద్ద ప్రతి రకమైన నైపుణ్యం కూడా స్వావలంబన భారతదేశానికి చాలా పెద్ద శక్తిగా మారుతుందని మోదీ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు