‘డిస్కవరీ’లో మోదీ

30 Jul, 2019 03:31 IST|Sakshi
జిమ్‌కార్బెట్‌ పార్కులో డిస్కవరీ సాహసికుడు బేర్‌ గ్రిల్స్‌తో ఉన్న ప్రధాని మోదీ

ముంబై: డిస్కవరీ టీవీ చానల్‌ ప్రసారం చేసే ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ ప్రత్యేక ఎపిసోడ్‌లో నరేంద్ర మోదీ కనిపించనున్నారు. పర్యావరణ మార్పుల వల్ల ఎదురయ్యే సమస్యలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ డిస్కవరీ ఈ ఎపిసోడ్‌ను రూపొందించింది. ఈ కార్యక్రమంలో సాహసాలు చేస్తూ కనిపించే బేర్‌ గ్రిల్స్‌తో కలిసి మోదీ కూడా ప్రత్యేక ఎపిసోడ్‌లో నటించారు. ఇందుకు సంబంధించిన షూటింగ్‌ ఉత్తరాఖండ్‌లోని జిమ్‌ కార్బెట్‌ జాతీయ పార్కులో జరిగింది. ఆగస్టు 12న 180 దేశాల్లో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది.

దీనిపై మోదీ ఓ ప్రకటన చేస్తూ ‘చాలా సంవత్సరాలపాటు నేను ప్రకృతి ఒడిలో, పర్వతాల నడుమ, అడవుల్లో జీవించాను. ఆ అనుభవాలు నా జీవితంపై చెరగని ముద్ర వేశాయి. రాజకీయాలకు సంబంధం లేని, ప్రకృతితో ముడిపడిన ప్రత్యేక కార్యక్రమం కావడంతో ఇందులో నటించేందుకు నేను ఒప్పుకున్నాను’ అని తెలిపారు. భారత పర్యావరణ సంపదను ప్రపంచానికి చూపేందుకు, పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన, ప్రకృతితో మమేకమై జీవించాల్సిన అవసరాన్ని చాటిచెప్పేందుకు తనకు ఈ కార్యక్రమం మంచి అవకాశమని మోదీ చెప్పారు. ఈ ఎపిసోడ్‌ టీజర్‌ను బేర్‌ గ్రిల్స్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ, మోదీతో కలిసి నటించడం తనకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు.

రేపు కంచికి రానున్న ప్రధాని
సాక్షి ప్రతినిధి, చెన్నై : ప్రధాని మోదీ బుధవారం తమిళనాడులోని కాంచీపురానికి రానున్నారు. 40 ఏళ్లకోసారి దర్శనమిచ్చే అత్తివరదరాజస్వాముల వారిని ఆయన దర్శించుకోనున్నారు. ఈ నెల 1 నుంచి స్వామివారు శయనరూపంలో దర్శనమిస్తున్నారు.

మరిన్ని వార్తలు