‘ముందు మీ ఇంటిని చూసుకోండి’

27 Dec, 2018 16:20 IST|Sakshi

న్యూఢిల్లీ : భారతదేశంలోని మైనారిటీలను ఉద్దేశిస్తూ పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఇప్పటికే ఇమ్రాన్‌ వ్యాఖ్యాల పట్ల క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌, ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఓవైసీ వంటి వారు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే బాలీవుడ్‌ నటుడు నసీరుద్దీన్‌ షా మాత్రం ఇమ్రాన్‌ వ్యాఖ్యల పట్ల కాస్త భిన్నంగా స్పందించారు. తన ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం కోసం ఇమ్రాన్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని పేర్కొన్నారు.

నసీరుద్దీన్‌ మాట్లాడుతూ.. ‘ఇమ్రాన్‌ వ్యాఖ్యల గురించి ఇప్పుడు నేను ఏం మాట్లాడిన నన్నో పాకిస్తాన్‌ ఏజెంట్‌లా చూస్తారు. ఒకవేళ ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తే.. అప్పుడు నేను మాట మార్చానంటారు’ అని తెలిపారు. తన దేశ ప్రజల మెప్పు పొందడం కోసం ఆయన వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలు ఇవి అన్నారు. ఒక వేళ ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకోవాలని చెప్పాల్సి వస్తే ఏం చెబుతారు అని అడగ్గా.. ‘అవును అలాంటి అవకాశం వస్తే తప్పకుండా చెప్తాను. మా దేశంలో జరిగే విషయాల గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముందు మీ ఇంటి గురించి పట్టించుకోండి అని చెప్తాన’న్నారు.

కొన్ని రోజుల క్రితం ఇమ్రాన్‌ ఖాన్‌ భారత్‌లో మైనారిటీలను ఇతర పౌరులతో సమానంగా చూడంలేదని అందరూ అంటున్నారు. బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే, అది తిరుగుబాటుకు దారితీస్తుందన్నారు. అంతటితో ఊరుకోక మైనారిటీలతో ఎలా మెలగాలో మోదీ ప్రభుత్వానికి చూపెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వార్తలు