స్నేహితుణ్ని కాపాడబోయి..

15 Feb, 2016 11:36 IST|Sakshi
స్నేహితుణ్ని కాపాడబోయి..

తానూ ప్రాణాలొదిలాడు
సెల్ఫీ తీసుకుంటూ డ్యామ్‌లోకి పడిపోయిన విద్యార్థులు


నాసిక్: సెల్ఫీ సరదా ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు తీసింది. డ్యామ్ వద్ద సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు ఓ విద్యార్థి నీటిలోకి జారి పడిపోయాడు. వెంటనే అతని స్నేహితుడు సాహసోపేతంగా డ్యామ్‌లోకి దూకి మునిగిపోతున్న విద్యార్థిని కాపాడబోయి తానూ ప్రాణాలు కోల్పోయాడు. వివరాలిలా ఉన్నాయి.. పది మంది కాలేజీ విద్యార్థులు విహార యాత్రల కోసం మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని ఘోటి సమీపంలో గల డ్యామ్ వద్దకు శనివారం వెళ్లారని వాదివ్‌హేర్ పోలీసు స్టేషన్ ఇన్‌చార్జ్ అధికారి మనోహర్ పాటిల్ తెలిపారు.

సౌరభ్ జగన్నాథ్ చుభార్ (18).. డ్యామ్ వద్ద ఓ రాతిపై సెల్ఫీ తీసుకుంటుండగా అదుపుతప్పి నీటిలో పడిపోయాడు. పక్కనే ఉన్న స్నేహితుడు అజింక్యా భౌసాహెబ్ జైకర్ (18).. నీటిలోకి దూకి సౌరభ్ జగన్నాథ్‌ను కాపాడేందుకు యత్నించగా ఇద్దరూ నీటిలో పడిపోయి మృతి చెందారు. మత్స్యకారుల సాయంతో మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం నాసిక్ ఆస్పత్రికి తరలించి పంచనామా నిర్వహించారు.

మరిన్ని వార్తలు