రాహుల్‌, సోనియాలకు భారీ ఎదురుదెబ్బ

10 Sep, 2018 19:28 IST|Sakshi

న్యూఢిల్లీ : నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి, సోనియా గాంధీ భారీ ఎదురుదెబ్బ తగిలింది. 2011-2012 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను రీ-అసెస్‌మెంట్‌ కోరుతూ ఆదాయం పన్ను శాఖ ఇచ్చిన నోటీసును సవాలు చేస్తూ సోనియా, రాహుల్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది. పన్ను ప్ర​క్రియలను తిరిగి తెరిచే అధికారం ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌కు ఉంటుందని తెలిపింది. సమస్యలు ఏమైనా ఉంటే ఆదాయపు పన్ను శాఖనే సంప్రదించాలని సూచించింది. నేషనల్‌ హెరాల్డ్‌ కేసుకు సంబంధించి, 2011-12 ఆర్థిక సంవత్సరపు పన్ను రీ-అసెస్‌మెంట్‌ను ఆదాయపు పన్ను శాఖ తిరిగి తెరవడంపై రాహుల్‌ గాంధీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.  

యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు రీ-ఎసెస్‌మెంట్ నోటీసులు పంపడంలో ఆదాయం పన్ను శాఖకు 'దురుద్దేశాలు' ఉన్నాయని సోనియాగాంధీ గత నెలలో ఢిల్లీ కోర్టుకు తెలియజేశారు. యంగ్‌ ఇండియన్‌ కంపెనీకి రాహుల్ గాంధీ డైరెక్టర్‌గా ఉన్నారు. అయితే దాని నుంచి రాహుల్‌ గాంధీ ఎలాంటి ఆదాయాన్ని ఆర్జించడం లేదని కాంగ్రెస్‌ అధ్యక్షుడి న్యాయవాది తెలిపారు. రాహుల్‌ గాంధీ యంగ్‌ ఇండియాకు డైరెక్టర్‌గా ఉన్న విషయాన్ని దాచిపెట్టారని ఆదాయపు పన్ను శాఖ ఆరోపించింది. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఇది ప్రధాన కంపెనీ. ఆదాయపు పన్ను శాఖ దగ్గర రాహుల్‌ గాంధీ నిజాలు దాయడంతో, రూ.154.97 కోట్ల విలువైన మొత్తాన్ని ఆర్జించినట్టు పేర్కొంది. 

మరిన్ని వార్తలు