ముంబయి: జాతీయ స్థాయి స్విమ్మర్ ఆత్మహత్యకు పాల్పడింది. వెస్ట్రన్ రైల్వేలో ఉద్యోగం చేస్తున్న ఆమె ఉరేసుకుని ప్రాణాలువిడిచింది. ముంబయిలోని లోవర్ పారెల్లోని ఆమె నివాసంలో ఈ అఘాయిత్యానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. తనిక ధార(23) అనే యువతి జాతీయస్థాయి స్విమ్మర్. గత ఏడాది సెప్టెంబర్లో నిర్వహించిన జాతీయ స్థాయి అక్వాటిక్స్ లో పాల్గొని వెండిపతకాన్ని సాధించింది.
అంతకుముందు 35వ తిరువనంతపురం నేషనల్ గేమ్స్(2015) క్రీడల్లో పాల్గొని కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం జూనియర్ క్లెర్క్గా పనిచేస్తోంది. తొలుత తన స్నేహితురాలు ఇంటికెళ్లి ఆమెను పలుమార్లు పిలిచినా తలుపు తీయలేదు. దీంతో అనుమానం వచ్చి స్థానికులను తీసుకొని రాగా వారు తలుపు బద్ధలు కొట్టి చూశారు. ఆ సమయంలో కిటికీ ఉన్న చువ్వకు ఉరేసుకుని ఆమె కనిపించింది. అప్పటికప్పుడు ఆస్పత్రికి తరలించినప్పటికే అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు శోధిస్తున్నారు.