సీఎం పీఠంపై వరుసగా ఐదోసారి..

29 May, 2019 11:02 IST|Sakshi

భువనేశ్వర్‌ : ఒడిసా ముఖ్యమంత్రిగా నవీన్‌ పట్నాయక్‌ వరుసగా ఐదోసారి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. పట్నాయక్‌తో పాటు 20 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేడీ చీఫ్‌ నవీన్‌ పట్నాయక్‌ను ఒడిషా గవర్నర్‌ గణేషి లాల్‌ ఆదివారం ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దేశంలో దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిలో నవీన్‌ పట్నాయక్‌ (72) ముందువరసలో నిలుస్తారు. లోక్‌సభతో పాటు జరిగిన ఒడిసా అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్ధానాల నుంచి పోటీ చేసిన పట్నాయక్‌ రెండింటిలోనూ భారీ మెజారిటీతో గెలుపొందారు.

భువనేశ్వర్‌లోని ఎగ్జిబిషన్‌గ్రౌండ్‌లో జరిగే ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర జాతీయ నేతలను పట్నాయక్‌ ఆహ్వానించారు. ఇక క్యాబినెట్‌ మంత్రులుగా రవీంద్ర ప్రతాప్‌ స్వాన్‌, నవ కిషోర్ దాస్‌, ప్రతాప్‌ జెనా, సుశాంత సింగ్‌ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. ఒడిసా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 147 స్ధానాలకు గాను బీజేడీ 112 స్ధానాల్లో గెలుపొంది ఘనవిజయం సాధించింది. బీజేపీ 23 స్ధానాల్లో, కాంగ్రెస్‌ 9 స్ధానాల్లో గెలుపొందాయి.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వార్తలు