పాక్ ఆర్మీ చీఫ్‌ను కౌగిలించుకోవడంపై సిద్ధూ క్లారిటీ..

19 Aug, 2018 17:42 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  పాకిస్తాన్ నూతన  ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారానికి వెళ్లిన భారత మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ పాక్ ఆర్మీ చీఫ్‌ను కౌగిలించుకుని మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ప్రమాణ స్వీకారానికి వెళ్లిన సిద్దూను పాక్‌ అగ్రనేతలతో పాటు తొలివరుసలో కూర్చోబెట్టారు. ఇమ్రాన్‌ ప్రమాణం చేసిన తర్వాత ఆయనను గట్టిగా ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాక్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఖమర్‌ జావెద్‌ బజ్వాను కూడా సిద్ధూ కౌగిలించుకున్నారు. ఇది ఇండియాలో చాలా మందికి నచ్చడంలేదు. ఈ విషయంపై సిద్ధూని చాలా మంది విమర్శిస్తున్నారు. కాగా సిద్ధూ మాత్రం తన చర్యలను సమర్థించుకున్నారు. అలా చేయడం మన సంస్కృతి అన్నారు. నా కౌగిలింతను తప్పుగా చూడోదంటూ మీడియా ద్వారా వేడుకున్నారు.

‘ మనం ఒక ప్రదేశానికి ప్రత్యేక ఆహ్వానితునిగా వెళ్తే.. వారు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాం. నేను మొదటగా దూరంగా కూర్చున్నా. కానీ వారు నన్ను స్టేజీపైకి రమ్మని తొలివరుసలో కూర్చోమన్నారు. అందుకే వెళ్లాను. అందులో తప్పేం ఉందని సిద్ధూ వ్యాఖ్యానించారు.

ఇక పాక్‌ ఆర్మీ చీఫ్‌ను కౌగిలంచుకోవడంపై స్పందిస్తూ.. ‘అతనే నా ముందుకు వచ్చి ఒకప్పుడు క్రికెటర్ కావాలని అనుకున్నట్లు చెప్పారు. అంతే కాదుసిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ 550వ జయంతి సందర్భంగా పాకిస్థాన్‌లో ఉన్న కర్తార్‌పూర్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్ కారిడార్‌ను తెరవడానికి  సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా నేను ఆప్యాయంగా మాట్లాడాను. అందులో తప్పేం ఉంది’  అని సిద్ధూ పేర్కొన్నారు.

కాగా పాక్‌ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకోవడం పట్ల పంజాబ్‌ సీఎం అమరీందర్ సింగ్ విముఖత వ్యక్తం చేశారు. సిద్ధూ చర్య సరైనది కాదు, పాక్‌ ఆర్మీ చీఫ్‌ పట్ల అంతటి అభిమానం చూపించడం తప్పని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు