సాక్షి, న్యూఢిల్లీ : జార్ఖండ్, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో నక్సల్స్ చిన్నారులను తమ శిబిరాల్లో చేర్చుకుని వారికి సైనిక శిక్షణ ఇస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆయా రాష్ట్రాల్లో నక్సల్స్ చిన్నారులతో వంట పనులు చేయించుకోవడం, భద్రతా దళాల కదలికలపై సమాచారం తెప్పించుకోవడం వంటి పనులు చేస్తున్నారని మంగళవారం లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వకం సమాధానంలో కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
నక్సల్స్ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో జాతీయ విధానం, కార్యాచరణ ప్రణాళికను తీసుకువచ్చిందని దాని ఆధారంగా ఈ సమస్యను ఎదుర్కొంటామని మంత్రి చెప్పారు. నక్సల్స్ను నిరోధించేందుకు ఆయా రాష్ట్రాలకు సీఏపీఎఫ్ బెటాలియన్స్ను మోహరించడం, హెలికాఫ్టర్లు ఇతర సాధనా సంపత్తిని హోం మంత్రిత్వ శాఖ సమకూరుస్తుందని తెలిపారు.