హైవేపై అత్యవసర ల్యాండింగ్‌

24 Jan, 2020 05:46 IST|Sakshi

ఘజియాబాద్‌: విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో లోపం తలెత్తడంతో పైలెట్‌ జాతీయరహదారిపై సురక్షితంగా ల్యాండింగ్‌ చేశాడు. ఈ ఘటన ఢిల్లీ సమీపంలో చోటుచేసుకుంది. ఎన్‌సీసీకి చెందిన రెండు సీట్ల శిక్షణ విమానం ఒకటి గురువారం మధ్యాహ్నం బరేలీ నుంచి హిండన్‌ ఎయిర్‌బేస్‌కు బయలుదేరింది. అరగంట తర్వాత ఇంజిన్‌లో లోపం తలెత్తినట్లు గుర్తించిన పైలెట్‌ అప్రమత్తమయ్యాడు. అధికారుల సూచనల మేరకు ఘజియాబాద్‌ జిల్లాలో రెండో నంబర్‌ జాతీయ రహదారిపై విమానాన్ని అత్యవసరంగా దింపాడు. అందులోని ఇద్దరు పైలెట్లు సురక్షితంగా బయటపడ్డారు. విమానం రెక్క ఒకటి స్వల్పంగా దెబ్బతింది.

మరిన్ని వార్తలు