‘ఆ కుటుంబాలకు బీజేపీ న్యాయం చేస్తుంది’

20 May, 2018 18:10 IST|Sakshi
రాంమాధవ్‌ (ఫైల్‌ ఫొటో)

వాషింగ్టన్‌: సిక్కు వ్యతిరేక అల్లర్లలో నష్టపోయిన సిక్కు కుటుంబాలకు బీజేపీ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్‌ తెలిపారు. అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో సిక్కు అమెరికన్లు నిర్వహించిన సిక్కుల సాంప్రదాయ పండుగ వైశాఖిలో రాంమాధవ్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అమెరికాలో నివాసముంటున్న సిక్కులు భారీ సంఖ్యలో హాజరైయారు.

కార్యక్రమంలో రాంమాధవ్‌ మాట్లాడుతూ...1984లో కాంగ్రెస్‌ పార్టీ పాలనలో జరిగిన సిక్కుల ఉచకోతలో చాలా మంది సిక్కులు మరణించారని, వారి కుటుంబానికి బీజేపీ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీయిచ్చారు. సిక్కు వ్యతిరేక అల్లర్లకు కారకులైన వారందరికి శిక్ష పడుతుందన్నారు. సిక్కు అల్లర్లపై ప్రభుత్వం నియమించిన జస్టిస్‌ ధింగ్రా కమిటీ అనేక అభియోగాలు నమోదు చేసిందని, సిక్కులపై 186కు పైగా దాడులు జరిగాయని గుర్తుచేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక సందేశము ద్వారా వైశాఖి పండుగను నిర్వహిస్తున్న వారందరికి అభినందనలు తెలిపారు. వైశాఖి సిక్కు సాంప్రదాయం, సిక్కు సమాజపు సంస్కృతి, విలువలను పెంచుతుందని పేర్కొన్నారు. ఇండో-అమెరికన్లు భారత్‌, అమెరికా మధ్య సంబంధాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారని రాంమాధవ్‌ ప్రశంసించారు.

మరిన్ని వార్తలు