దేశవ్యాప్తంగా నేడే ‘నీట్‌’ 

5 May, 2019 01:47 IST|Sakshi

తుపాను కారణంగా ఒడిశాలో పరీక్ష వాయిదా

రాష్ట్రంలో 5 జిల్లాల్లో సెంటర్లు.. 70 వేల మంది పరీక్ష రాసే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్‌లో ప్రవేశాలకు నిర్వహించే ‘నీట్‌’ ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు జరగనుంది. సుమారు 70 వేల మంది పరీక్ష రాసే అవకాశం ఉంది. ఫొని తుపాను కారణం గా ఒడిశాలో నీట్‌ను వాయిదా వేశారు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో దాదాపు వంద కేంద్రాల్లో పరీక్ష నిర్వ హిస్తున్నారు. తెలంగాణ, ఏపీలో విద్యార్థులకు తెలుగులో పరీక్ష రాసే వీలు కల్పించారు. నిబంధనల ప్రకారం పరీక్ష ప్రారంభ సమయానికి 2 గంటల ముందే కేంద్రాన్ని తెరుస్తారు. విద్యార్థులు మధ్యాహ్నం 1.30 గంటలలోగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ఆ తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. డ్రెస్‌కోడ్‌ మొదలు ఇతరత్రా అనేక నిబంధనలు విధించారు. 

ఇంటర్‌ గందరగోళం విద్యార్థులపై ప్రభావం... 
రాష్ట్రంలో ఇంటర్‌ ఫలితాల్లో తప్పిదాల వల్ల వేలాది మంది విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చాయి. ముఖ్యంగా బైపీసీ విద్యార్థులు నీట్‌ పరీక్షకు సిద్ధం అవుతుండగా ఇంటర్‌లో వచ్చిన మార్కులు వారిని తీవ్ర నిరాశకు గురిచేశాయి. దీంతో వారంతా ప్రవేశపరీక్షకు సిద్ధం కాలేదని తెలిసింది. కొన్నిచోట్ల నీట్‌ కోచింగ్‌ సెంటర్లకు మొదట్లో చేరిన వారిలో కొందరు ఇంటర్‌ ఫలితాల తర్వాత రాలేదని సమాచారం. కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు మాత్రం తల్లిదండ్రులకు ఫోన్లు చేసి నీట్‌కు ఇంటర్‌ వెయిటేజీ ఏమీ ఉండదని, తక్కువ మార్కులు వచ్చినా ఏమీ పరవాలేదని భరోసా కల్పించాయి. 

మరిన్ని వార్తలు