ఒకేచోట 86,707 సూర్యనమస్కారాలు

24 Nov, 2019 11:48 IST|Sakshi

ఎన్‌ఈఎస్‌ విద్యార్థులు, ఉపాధ్యాయుల వినూత్న ఘనత

భివండీ: భివండీ పట్టణంలోని ఎన్‌ఈఎస్‌ హైస్కూ వార్శికోత్సవం వినూత్న పద్దతిలో చేపట్టారు. విద్యార్థులు, ఉపాధ్యాయులంతా కలసి 86,707 సూర్యనమస్కారాలు చేశారు. ఎన్‌ఈఎస్‌ పాఠశాలను స్థాపించి 50 వసంతాలు పూర్తయ్యాయి. దీంతో పాఠశాల వార్శికోత్సవాలను ఘనంగా నిర్వహించారు.  ఈ వార్శికోత్సవాలలో భాగంగా 2,240 మంది విద్యార్థులు మూడు ప్రాంతాల్లో ఒకే సారి సూర్య నమస్కారాలు చేపట్టాలని నిర్ణయించారు. 

అయితే ఈ కార్యక్రమంలో శుక్రవారం ఉదయం ఏడు గంటల నుంచి ఉదయం 10.30 గంటల వరకు ప్రతి ఒక్కరు 13 సూర్య నమస్కారాలు చొప్పున కొంత సమయం విశ్రాంతి తీసుకుని మళ్లీ 123 సార్లు ఇలా మూడు పర్యాయాలుగా  చేశారు. అయితే వీరిలో కొందరు 13 సార్లు సూర్యనమస్కారాలు చేయలేకపోవడంతో మొత్తం 86,707 సూర్య నమస్కారాలు పూర్తిచేసినట్లయింది. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, మాజీ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్రీడా మహర్శి అరుణ్‌ దాతర్, క్రీడా భారతి సంస్థా మహామంత్రి రాజ్‌ చౌదరి, కమలా కిశోర్‌ హెడా, డాక్టర్‌ రాహుల్‌ జోషి, వినోద్‌ శెటే, దాస్‌బాయి పటేల్‌లు హాజరయ్యారు.  

అభినందనీయం: అరుణ్‌ దాతర్‌ 
క్రీడా మహర్శి అరుణ్‌ దాతర్‌ మాట్లాడుతూ.. వార్శికోత్సవం సందర్భంగా ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. పాఠశాల యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. నేటి యుగం వేగంగా పరుగెడుతున్న తరుణంలో యువకులు, విద్యార్థులు యోగ, కసరత్తులాంటివికి ప్రాముఖ్యత ఇవ్వకుండా పోతున్నారు. ఉదయం నిత్యం సూర్య నమస్కారాలు చేసినట్లయితే ఆరోగ్యంతో పాటు విద్యార్థులు అన్ని విద్యల్లో చురుకుగా ఉంటారని సూచించారు. అదేమాదిరిగా పాఠశాల ఉపాధ్యక్షులు డాక్టర్‌ వివేక్‌ జోషి మాట్లాడుతూ.. విద్యార్థులకు సూర్యనమస్కారాలు నేర్పించడానికే ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు.  

మరిన్ని వార్తలు