‘నాథులాల్‌ చెప్పాడు.. ప్రెసిడెంట్‌ అయ్యాను’

1 Nov, 2018 20:20 IST|Sakshi
జ్యోతిష శాస్త్ర పండితుడు నాథులాల్‌ వ్యాస్‌

జైపూర్‌ : రాజస్తాన్‌ భిల్వారాకు 20 కిలోమీటర్ల దూరాన ఉన్న కరియో గ్రామానికి పలు రాజకీయ పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. ఏంటా ఊరి ప్రత్యేకత అంటే ఈ గ్రామం జ్యోతిష​ నగరంగా ప్రసిద్దికెక్కింది. ఇక్కడ ఉ‍న్న ఓ పండితుని వల్ల ఈ గ్రామానికి ఇంత పేరు ప్రఖ్యాతులు. ఈ గ్రామ వాస్తవ్యుడైన నాథులాల్‌ వ్యాస్‌(95) అనే జ్యోతిషున్ని కలవడానికి నేతలంతా కరియో గ్రామానికి ప్రయాణం కట్టారు.  నాథులాల్‌ ‘భృగు సాహిత్య’ నిపుణుడు మాత్రమే కాకా మంచి జ్యోతిష శాస్త్ర పండితుడు. ఈయన మాటకు తిరుగులేదని ఈ ప్రాంతంలో ఓ నమ్మకం.

రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌కు చెందిన పలువురు రాజకీయ నాయకులకు ఇయన మాట అంటే చాలా గురి. దాంతో ఎన్నికల ముందు ఈ పండితున్ని కలిసి సలహా తీసుకోవడం ఆనవాయితీగా మారింది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పలువురు నేతలు ఈ పండితుడి ఇంటికి బారులు తీరారు. అయితే నాథులాల్‌ ఇంత ప్రసిద్ధి చెందడానికి కారణం మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌.  పాటిల్‌, ఆమె భర్త దేవ్‌ సింగ్‌ పాటిల్‌ నాథులాల్‌ని తరచుగా కలుస్తూ ఆయన సలహాలు పాటించేవారు.

ఈ క్రమంలో ప్రతిభా పాటిల్‌ తన జీవితంలో చాలా ఉన్నతమైన స్థానాలకు వెళ్తుందని నాథులాల్‌ జోస్యం చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే ప్రతిభా పాటిల్‌ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. దాంతో పాటిల్‌ తన ప్రమాణస్వీకార మహోత్సవానికి నాథులాల్‌ని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. అప్పటి నుంచి ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది. జాతకాలను బాగా నమ్మే పలువురు రాజకీయ నేతలు తమ భవిషత్‌కు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు నాథులాల్‌ను కలవడం పరిపాటిగా మారింది. రిలయన్స్‌ అధినేత ధీరుభాయ్‌ అంబానీ, స్మృతి ఇరానీ, అమర్‌ సింగ్‌ వంటి పలవురు ప్రముఖులు నాథులాల్‌ని నమ్మే వారిలో కొందరు.

మరిన్ని వార్తలు