కొత్త మలుపు తిరిగిన 'అనుహ్య' హత్య కేసు

1 Apr, 2014 12:24 IST|Sakshi
కొత్త మలుపు తిరిగిన 'అనుహ్య' హత్య కేసు

ముంబైలో అత్యంత పాశవికంగా హత్యకు గురైన ఆంధ్రప్రదేశ్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎస్తర్ అనుహ్య కేసు కొత్త మలుపు తిరిగింది. అనుహ్య హత్య కేసులో అరెస్ట్ అయిన చంద్రబాన్ సనప్ డీఎన్ఏకు, మృతురాలి శరీరంలో లభించిన డీఎన్ఏకు సరిపోలడం లేదు. అత్యాచారం జరిగినప్పుడు నిందితుడి వీర్యం బాధితురాలి శరీరంలో ఉంటుంది.  దాని ఆధారంగా ఫోరన్సిక్ నిపుణులు పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షలలో మృతురాలి శరీరంలోని డిఎన్ఏతో నిందితుడి డిఎన్ఏ సరిపోలడంలేదు. ఈ మేరకు మహారాష్ట్ర ఫోరన్సిక్ నివేదిక మంగళవారం స్పష్టం చేసింది.  దాంతో అనుహ్య కేసు  మరో సారి మరో మలుపు తిరగటంతో ముంబై పోలీసులు తలలు పట్టుకున్నారు. ఈ కేసు ఎప్పటికి కొలిక్కి వస్తుందోనని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా మచిలీపట్నంకి చెందిన ఎస్తర్ అనుహ్యా ముంబైలోని టీసీఎస్లో సాప్ట్ వేర్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తుంది. గతేడాది డిసెంబర్లో క్రిస్టమస్స్ సెలవులకు ఇంటి వచ్చిన అనుహ్య... జనవరి మొదటి వారంలో ముంబై తిరుగు ప్రయాణమైంది. ఆ క్రమంలో ముంబైలో దిగిన అనుహ్య ఆకస్మాత్తుగా అదృశ్యమైంది. అనుహ్య ఆచూకీ తెలియకపోవడంతో ఆమె తండ్రి హరి ప్రసాద్ కంగారుపడి ముంబై పోలీసులను ఆశ్రయించారు. అయిన ఫలితం కనిపించకపోవడంతో  హరిప్రసాద్ ఆయన బంధువులు ముంబై నగరంలో అనుహ్య కోసం జల్లెడ పట్టారు.

నగరంలోని కంజూర్‌మార్గ్ ప్రాంతంలో కాలిపోయి ఉన్న మృతదేహన్ని అనుహ్యదిగా ఆమె తండ్రి గుర్తించారు. అనుహ్య మృతిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఆ కేసులో ఎటువంటి పురోగతి లేకపోవడంతో అనుహ్య తండ్రి హరిప్రసాద్ కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేకు ఫిర్యాదు చేశారు. దాంతో ముంబై పోలీసులు చంద్రభాన్ సనప్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అనుహ్యపై అత్యాచారం చేసి,  హత్య చేసినట్లు చంద్రభాన్ నేరాన్ని ఒప్పుకున్నాడు. అయితే అనుహ్య మృతదేహంలోని డీఎన్ఏకి చంద్రభాన్ డీఎన్ఏ సరిపోలకపోవడంతో ముంబై పోలీసులకు అనుహ్య కేసు పెద్ద మిస్టరీగా మారింది.     
 

మరిన్ని వార్తలు