కార్చిచ్చు విషాదం : ప్రేమజంటకు శాశ్వత ఎడబాటు

13 Mar, 2018 18:22 IST|Sakshi

చెన్నై : ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు.. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు.. ట్రెక్కింగ్‌ వెళ్లాలన్న సరదా వారికి శాశ్వత ఎడబాటు మిగులుస్తుందని ఊహించలేకపోయారు.. కురుంగణి కొండల్లో ఆదివారం చెలరేగిన కార్చిచ్చులో నవ దంపతులు వివేక్(27) ప్రాణాలు కోల్పోగా.. దివ్య(29) తీవ్రంగా గాయపడ్డారు.

తన కంటే వయసులో పెద్దదైన అమ్మాయి(దివ్య)ను పెళ్లి చేసుకునేందుకు ఇరువురి కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో వివేక్‌, దివ్యలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేసి నాలుగు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. కుటుంబసభ్యులకు దూరంగా ఉంటూ చెన్నైలోని ఈరోడ్‌లో నివసిస్తున్నారు.

ట్రెక్కింగ్‌కు వెళ్లాలనే సరదాతో ఆదివారం కురంగణి అడవులకు వెళ్లారు. ఉన్నట్లుండి అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు వారి జీవితంలో విషాదాన్ని మిగిల్చింది. ప్రమాదంలో వివేక్‌ మరణించగా, దివ్య మధురైలోని రాజాజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పెళ్లితో దూరమైన కుటుంబసభ్యులు ఆమెను చూసేందుకు ఆసుపత్రికి వచ్చారు.

‘వివేక్‌ దుబాయ్‌లో జాబ్‌ చేసేవాడు. కొద్దిరోజుల్లో దివ్యను దుబాయ్‌ తీసుకెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. కానీ ఇంతలోనే ఇలా జరగుతుందని అనుకోలేదని’ వారి స్నేహితులు కంటతడి పెట్టారు. తమిళనాడులోని తేని జిల్లా అటవీప్రాంతంలోని కురంగణి కొండల్లోని అడవుల్లో చెలరేగిన కార్చిర్చు 10 మందిని బలి తీసుకున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు