ఢిల్లీ ప్రభుత్వానికి భారీ జరిమానా

16 Oct, 2018 17:05 IST|Sakshi

ఆప్‌ ప్రభుత్వానికి రూ.50 కోట్ల పెనాల్టీ విధించిన ఎన్జీటీ

సాక్షి, న్యూఢిల్లీ : జనావాసాల్లో ఉక్కు శుద్ధి పరిశ్రమల నియంత్రణలో విఫలమైన ఢిల్లీ ప్రభుత్వానికి భారీ జరిమానా పడింది. నిషేదిత ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు కావడంవల్ల స్థానికులకు అనారోగ్య సమస్యలతో పాటు యుమునా నది కాలుష్యానికి గురవుతోందని ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్‌ ఆదర్శ్‌కుమార్‌ గోయెల్‌ నేతృత్వంలోని బెంచ్‌ మంగళవారం ఢిల్లీ ప్రభుత్వానికి రూ. 50 కోట్లు పెనాల్టీ విధిస్తూ తీర్పు వెలువరించింది. జనావాసాల్లో నెలకొల్పిన స్టీల్‌ శుద్ధి పరిశ్రమలను వెంటనే మూసేయించాలని ఆదేశాలు జారీచేసింది. 

‘ఆలిండియా లోకాధికార్‌ సంఘం’ అనే ఎన్జీవో వేసిన పిటిషన్‌పై విచారించిన ట్రైబ్యునల్‌ ఈ తీర్పునిచ్చింది. కాగా, ఢిల్లీ మాస్టర్‌ప్లాన్‌-2021 ప్రకారం నిషేదించబడిన ప్రదేశంలో పరిశ్రమలు ఏర్పాటయ్యాయనీ, వాటిని నియంత్రించాలని ఢిల్లీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు (డీపీసీసీ)కు ఎన్జీటీ గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. ఎన్జీటీ ఆదేశాలను పట్టించుకోకపోవడంతో కేజ్రీవాల్‌ ప్రభుత్వానికి భారీ జరిమానా తప్పలేదు.

మరిన్ని వార్తలు