మహారాష్ట్ర ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ షాక్‌

29 Aug, 2018 14:41 IST|Sakshi

 సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవహక్కుల కమిషన్‌

 మహారాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసు బాస్‌కు నోటీసులు

 నాలుగువారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశం

సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ భారీ షాక్‌ ఇచ్చింది.  దేశవ్యాప్తంగా అయిదుగురు  మానవహక్కుల కార్యకర్తల అరెస్టులను సుమోటోగా స్వీకరించిన కమిటీ మహారాష్ట్ర ప్రభుత్వానికి, డీజీపికి నోటీసులు జారీ చేసింది. ఐదుగురు కార్యకర్తల అరెస్టు వ్యవహారం‍లో ప్రామాణిక పద్ధతులను అనుసరించలేదని ఆరోపించింది. ఇది వారి మానవ హక్కుల ఉల్లంఘనే అంటూ  మొట్టికాయలేసింది. ఈ మేరకు మహారాష్ట్ర  ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై నాలుగు వారాల్లో 'వాస్తవ నివేదిక' సమర్పించాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ కోరింది.

దేశవ్యాప‍్తంగా అయిదు రాష్ట్రాల్లోని పలునగరాల్లో మానవహక్కుల కార్యకర్తల అరెస్టులపై నివేదికలను హక్కుల సంఘం పరిశీలించిన తరువాత నోటీసులు పంపించామని జాతీయ మానవ హక్కుల కమిషన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో పుణే పోలీసులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో మానవ, దళిత హక్కుల  కార్యకర్తలపై ఇళ్లపై ఆకస్మిక దాడులు, అరెస్టులు కలకలం రేపాయి. విప్లవ కవి వరవరరావు,  అరుణ ఫెరారి,  వెర్నాన్‌ గోన్‌సాల్వేస్‌,  రోనా విల్సన్‌, న్యాయవాది సురేంద్ర, సుధా భరద్వాజ్‌, గౌతం నావ్‌లాఖ్‌ ఇళ్లపై సోదాలు నిర్వహించారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.  మరోవైపు ఈ అరెస్టులకు నిరసనగా దేశ వ్యాప్తంగా వివిధ ప్రజల సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేపట్టారు.

మరోవైపు విరసం నేత వరవరరావుతో సహా మరో నలుగురు పౌరహక్కుల నేతల అరెస్ట్‌లపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది.  ప్రమఖ చరిత్రకారిణి రొమిల్లా థాపర్‌తోపాటు మరో నలుగురు పౌరహక్కుల నేతల అరెస్ట్‌ను ఖండిస్తూ.. సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

మరిన్ని వార్తలు