-

ఈ పెన్‌ పదాలను లెక్కిస్తుంది..

16 Apr, 2018 18:33 IST|Sakshi

సాక్షి, శ్రీనగర్‌ : కంప్యూటర్‌లో, మొబైల్‌ ఫోన్లలో మనం ఎన్ని పదాలు టైప్‌ చేశామో తెలుస్తుంది.. కానీ పేపర్‌పై మాత్రం ఎన్ని పదాలు రాశామో తెలుసుకోవడం కష్టమే.. కానీ ఓ తొమ్మిదేళ్ల బాలుడు తయారుచేసిన కౌంటింగ్‌ పెన్‌ దీనికి పరిష్కారం చూపింది. రాసే పెన్నుతోనే ఎన్ని పదాలు రాస్తున్నామో తెలిసుకునేలా దీనిని రూపొందించాడు. ఈ పెన్నుని తయారుచేసిన జమ్మూకాశ్మీర్‌కు చెందిన ముజఫర్ అహ్మద్ ఖాన్‌ని పలువురు ప్రశంసిస్తున్నారు.

ఈ పెన్‌ ద్వారా ఎన్ని పదాలు రాస్తున్నామో వాటి సంఖ్య పెన్ను పైభాగంలో గల  చిన్న ఎల్‌సీడీ స్ర్కీన్‌పై కనిపించడంతో పాటు మొబైల్‌కు కూడా మెసేజ్ వస్తుంది. ‘పరీక్షలో తక్కువ పదాలు రాసినందుకు తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో ఎంతో కుంగిపోయాను. ఆ తర్వాత పరీక్షలో టైమ్‌ ఎలా సద్వినియోగం చేసుకోవాలనే దానిపై దృష్టి సాధించాను. ఆ ఆలోచనల్లో నుంచి తయారయిందే ఈ కౌంటింగ్‌ పెన్‌’  అని అహ్మద్‌ తెలిపాడు. 

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన ఓ ఇన్నోవేషన్‌ కార్యక్రమంలో ఈ పెన్నుని ప్రదర్శించగా.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అహ్మద్‌ను ప్రశంసించడంతో పాటు రివార్డును అందజేశారు. నేషనల్‌ ఇన్నోవేషన్‌ పౌండేషన్‌ కౌంటింగ్‌ పెన్‌ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి నిర్ణయించుకుంది. మే నుంచి ఈ పెన్ను మార్కెట్‌లోకి రానుంది.

మరిన్ని వార్తలు