మళ్లీ న్యాయ హక్కులు ఇవ్వండి

7 Mar, 2020 04:58 IST|Sakshi

మళ్లీ ‘సుప్రీం’కు నిర్భయ దోషి

న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషుల్లో ఒకరైన ముఖేష్‌ సింగ్‌ మరోసారి సుప్రీంకోర్టు తలుపు తట్టాడు. న్యాయవాదులు తప్పుదోవ పట్టించిన కారణంగా న్యాయపరంగా తనకు ఉన్న హక్కులన్నింటినీ మళ్లీ దఖలుపరచాలని కోరుతూ ఎం.ఎల్‌ శర్మ అనే న్యాయవాది ద్వారా శుక్రవారం ఓ పిటిషన్‌ వేశారు. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం, కోర్టు సహాయకారిగా వ్యవహరించిన న్యాయవాది వృందా గ్రోవర్‌లు తనపై నేరపూరిత కుట్ర పన్నారని, మోసానికి పాల్పడ్డారని ఈ అంశాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కూడా ముఖేష్‌ తన తాజా పిటిషన్‌లో కోరారు. సుప్రీంకోర్టు తన క్యూరేటివ్‌ పిటిషన్‌ను కొట్టేసిన నాటి నుంచి న్యాయస్థానాలు ఇప్పటివరకూ జారీ చేసిన అన్ని ఉత్తర్వులను కొట్టివేయాలని, రాష్ట్రపతి తన క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడాన్ని కూడా రద్దు చేయాలని కోరాడు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపే అవకాశముంది.  

సంతకాల కోసం బెదిరించారు
‘‘కేంద్ర హోం శాఖ, ఢిల్లీ ప్రభుత్వం, వృందా గ్రోవర్‌తోపాటు సెషన్స్, హైకోర్టు సుప్రీంకోర్టుల్లో వాదించిన న్యాయమూర్తులు కలిసి పన్నిన కుట్రకు నేను బలయ్యాను. సెషన్స్‌ కోర్టు ఉత్తర్వులను బూచిగా చూపించి పలు పత్రాలపై సంతకాలు పెట్టించుకున్నారు’ అని ముఖేష్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.  క్యూరేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేసేందుకు సంతకాలు పెట్టించాలని సెషన్స్‌ కోర్టు ఆదేశించినట్లు ప్రతివాదులు ముఖేష్‌ సింగ్‌తో చెప్పారని  వివరించారు.

మరిన్ని వార్తలు