నిర్భయ కేసు: జస్టిస్‌ ఆర్‌.భానుమతికి స్వల్ప అస్వస్థత

14 Feb, 2020 16:19 IST|Sakshi

న్యూఢిల్లీ : నిర్భయ కేసులో వాదనలు వింటున్న ముగ్గురు సభ్యుల సుప్రీం ధర్మాసనంలో ఒకరైన జస్టిస్‌ ఆర్‌.భానుమతి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నిర్భయ దోషులకు వేర్వేరుగా ఉరి శిక్ష విధించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. విచారణను వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు చదివి వినిపిస్తున్న క్రమంలో​ జస్టిస్‌ ఆర్‌.భానుమతి అస్వస్థత కారణంగా సొమ్మసిల్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం తేరుకున్నారు. ఆమెను కోర్టు సిబ్బంది వీల్‌ చెయిర్‌లో చాంబర్‌కు తరలించారు. అనంతరం వైద్యులు ఆమెకు చికిత్సనందించారు.
(చదవండి : నిర్భయ కేసు: వినయ్‌ శర్మ పిటిషన్‌ కొట్టివేత)

ఇక పిటిషన్‌ను వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్టు తెలిపిన సుప్రీం ధర్మాసనం.. తదుపరి విచారణ తేదీని ఉత్తర్వుల్లో వెల్లడిస్తామని పేర్కొంది. దోషుల ఉరికి సంబంధించి వచ్చే సోమవారం కింది కోర్టు ఉత్తర్వులు ఇవ్వనున్నందున అప్పటి వరకు వేచి చూడాలని అపెక్స్‌ కోర్టు కేంద్రానికి స్పష్టం చేసింది. ఇప్పటి వరకు దోషులకు సంబందించి ఎటువంటి పిటిషన్‌లు కోర్టుల్లో పెండింగ్‌లో లేవని తెలిపింది. కాగా, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ క్షమాభిక్ష తిరస్కరణను చాలెంజ్‌ చేస్తూ దోషుల్లో ఒకరైన వినయ్‌ శర్మ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం ఈ రోజు (శుక్రవారం) కొట్టివేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు