నిర్భయ కేసు : వినయ్‌ శర్మ పిటిషన్‌ తిరస్కరణ

1 Feb, 2020 11:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ దోషుల్లో ఒకరైన వినయ్‌ శర్మ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శనివారం తిరస్కరించారు. ఇక నిర్భయ దోషులైన పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మ, అక్షయ్‌ కుమార్, ముకేశ్‌ సింగ్‌ల ఉరిశిక్ష అమలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. చట్టపరంగా తమలో కొందరికి మిగిలి ఉన్న అవకాశాలను వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని దోషుల విఙ్ఞప్తి మేరకు.. ఉరిశిక్ష అమలు వాయిదా వేయాలంటూ అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి ధర్మేందర్‌ రాణా శుక్రవారం ఆదేశించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు శిక్షను అమలు చేయొద్దని స్పష్టం చేశారు.
(చదవండి : ‘నిర్భయ’ దోషుల ఉరి మళ్లీ వాయిదా)

నిబంధనలకు విరుద్ధం..!
దోషులు పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మ, అక్షయ్‌ కుమార్, ముకేశ్‌ కుమార్‌ సింగ్‌లను ఫిబ్రవరి ఒకటో తేదీ ఉదయం 6 గంటలకు ఉరి తీయాలంటూ కోర్టు జనవరి 17వ తేదీన ఆదేశించారు. అయితే, వినయ్‌ క్షమాభిక్ష పిటిషన్‌ రాష్ట్రపతి కోవింద్‌ వద్ద పెండింగ్‌లో ఉండటం.. మిగతా ఇద్దరు (అక్షయ్‌, పవన్‌) చట్టపరమైన అవకాశాలను ఉపయోగించుకునేందుకు వీలుగా ఉరి శిక్ష అమలును వాయిదా వేయాలంటూ వారి తరఫున లాయర్‌ ఏపీ సింగ్‌ గురువారం అడిషనల్‌ సెషన్స్‌ కోర్టులో వాదనలు వినిపించారు. నలుగురిలో ఏ ఒక్కరి పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్నా మిగతా వారిని ఉరి తీయడం నిబంధనలకు విరుద్ధమని దోషుల తరఫు న్యాయవాది వాదించారు. ఏకీభవించిన న్యాయమూర్తి డెత్‌ వారెంట్లను వాయిదా వేస్తూ ఆదేశాలిచ్చారు.
(చదవండి : అందుకే నిర్భయ దోషుల ఉరిశిక్షపై స్టే: జడ్జి)

>
మరిన్ని వార్తలు