సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి, ఏడేళ్లుగా నలుగుతున్న నిర్భయ కేసులో బాధితురాలికి ఎట్టకేలకు న్యాయం జరిగింది. దోషులు ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్ (31)ను ఈరోజు (శుక్రవారం) ఉదయం 5:30 గంటలకు తీహార్ జైలులో ఉరి తీశారు. అయితే, మరణ దండన నుంచి తప్పించుకునేందుకు న్యాయపరమైన అవకాశాల పేరుతో దోషులు తీవ్ర ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉరి శిక్ష అమలుకు రెండు గంటల ముందు వరకు దోషుల ప్రయత్నాలు ఆగలేదు. ఢిల్లీ హైకోర్టులో అర్ధరాత్రి వరకు వాదనలు కొనసాగాయి. ఉరిపై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దీంతో వారు మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నిర్భయ దోషుల చివరి పిటిషన్ను శుక్రవారం తెల్లవారు జామున 3:30 గంటలకు సుప్రీం కోర్టు కొట్టివేసింది.
(చదవండి: నిర్భయ కేసు : దేశ చరిత్రలో ఇదే ప్రథమం)
కాగా, దోషులు పిటిషన్లమీద పిటిషన్లు వేయడంతో డెత్ వారెంట్లు జారీ అయ్యాక మూడు సార్లు ఉరి అమలు నిలిచిపోయింది. 2020, జనవరి 22 న దోషులను ఉరితీయాలని ఢిల్లీ పటియాలా హౌజ్కోర్టు తొలుత డెత్ వారెంట్లు జారీ చేసింది. దోషుల వరుస పిటిషన్లతో ఉరి అమలు సాధ్యం కాలేదు. అనంతరం ఫిబ్రవరి 1, తర్వాత మార్చి 3న ఉరితీయాలని డెత్ వారెంట్లు జారి అయినప్పటికీ శిక్ష అమలు వాయిదా పడింది. ఎట్టకేలకు మార్చి 20న (నాలుగోసారి) ఉరితీయాలని జారీ అయిన డెత్ వారెంట్ల ద్వారా నిర్భయకు న్యాయం జరిగింది.
(చదవండి: నా కుమార్తెకు న్యాయం జరిగింది: ఆశాదేవీ)
ఏడేళ్ల నిర్భయ కేసు పరిణామాలు..