దోషులను నాలుగుసార్లు చంపేశారు : ఏపీ సింగ్‌

5 Mar, 2020 16:07 IST|Sakshi

వారేమీ ఉగ్రవాదులు కాదు : దోషుల తరఫు న్యాయవాది

సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ అత్యాచార కేసులో ఇద్దరు దోషులు అక్షయ్‌ సింగ్, పవన్‌ గుప్తాల తరఫున వాదిస్తోన్న న్యాయవాది ఏపీ సింగ్‌ న్యాయ వ్యవస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  దోషులను మార్చి 20న ఉరితీయాలంటూ పటియాల హౌస్‌కోర్టు కొత్త డెత్‌వారెంట్లు జారీచేయడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. డెత్‌వారెంట్ల జారీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘దోషులకు నాలుగు సార్లు డెత్‌వారెంట్ల జారీచేసి, వారిని నాలుగు సార్లు చంపేశారు. వారేమీ ఉగ్రవాదులు కాదు. భయంకరమైన నేరస్తులుగా చిత్రీకరించి మీడియా వారిని ఎప్పూడో చంపేసింది’ అని వ్యాఖ్యానించారు. నిర్భయ దోషులను న్యాయవ్యవస్థ చేసిన హత్యగా ఆయన వర్ణించారు. కాగా ఢిల్లీ నడిబొడ్డున ఘోరమైన ఘటనకు పాల్పడిన నలుగురు దోషులను ఉరిశిక్ష నుంచి కాపాడుతున్న దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌ పేరు ఇటీవల సర్వత్రా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. (వారి చావును చూడాలనుంది)

నిర్భయపై వివాదాస్పద వ్యాఖ్యలతోనే కాకుండా, చట్టంలోని అవకాశాలను ఉపయోగించుకుని, పదే పదే ఉరిశిక్షను వాయిదా వేయిస్తున్నందుకు కూడా ఇప్పుడాయన వార్తల్లో వ్యక్తిగా ఉన్నారు. నిర్భయపై అత్యాచారం జరగడానికి ఆమె వేసుకున్న దుస్తులూ, ఆమె జీవన విధానం కారణమని ఆయన గతంలో లింగ వివక్షతో కూడిన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. ‘నా కూతురు ఇలా పెళ్ళికి ముందు బాయ్‌ ఫ్రెండ్‌తో తిరుగుతుంటే సజీవంగా దహనం చేసేవాడిని. ఇలాంటి ఘటన జరగనిచ్చేవాడిని కాదు’ అని కూడా అన్నారు.కాగా దోషులకు ఉన్న అన్ని న్యాయపరమైన అంశాలు దాదాపు మూసుకుపోయాయి. నలుగురు దోషుల రివ్యూ పిటిషన్‌లతో పాటు క్షమాభిక్ష పిటిషన్‌ను కూడా దాఖలు చేయడం, తిరస్కరించడం వంటిని పూర్తి అయ్యాయి. దీంతో మార్చి 20న ఖచ్చితంగా శిక్ష అమలై తీరుతుందని నిర్భయ తరఫు న్యాయవాదులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. (నిర్భయ దోషులకు కొత్త డెత్‌ వారెంట్లు)

మరిన్ని వార్తలు