చావును వాడుకోకండి.. నిర్భయ తల్లి కన్నీటి పర్యంతం

17 Jan, 2020 13:01 IST|Sakshi

న్యూఢిల్లీ: ‘చేతులు జోడించి అడుక్కుంటున్నా.. ఆ నలుగురికి వెంటనే ఉరిశిక్ష అమలు చేయండి’ అంటూ నిర్భయ తల్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విఙ్ఞప్తి చేశారు. తన కూతురి మరణాన్ని అపహాస్యం చేయవద్దని కన్నీళ్లతో రాజకీయ పార్టీలను వేడుకున్నారు. ఏడేళ్ల క్రితం జరిగిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులకు ఈ నెల 22న ఉరిశిక్ష అమలు చేసేలా డెత్‌వారెంట్లు జారీ అయిన విషయం తెలిసిందే. అయితే.. మరణశిక్ష నుంచి తప్పించుకునేందుకు వారు అన్ని విధాలుగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆఖరి ప్రయత్నంగా క్షమాభిక్ష ప్రసాదించాలంటూ దోషుల్లో ఒకడైన ముఖేశ్‌ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశాడు.

ఈ పరిణామాల నేపథ్యంలో నిర్భయ దోషుల్ని ఉరి తీయడానికి ఢిల్లీలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ సర్కారు ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తోందని బీజేపీ ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. 2017లోనే సుప్రీం కోర్టు వారికి ఉరిశిక్ష ఖరారు చేసినప్పటికీ ఆప్‌ ప్రభుత్వం ఉరి అమలును ఎందుకు నానుస్తోందని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ఆరోపించగా.. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా ఆయన విమర్శలను తిప్పికొట్టారు. ఈ క్రమంలో నిర్భయ తల్లి గురువారం మీడియాతో మాట్లాడారు.(నిర్భయ దోషుల ఉరిశిక్షకు లైన్‌ క్లియర్‌!)

‘‘ నా కూతురిని చంపిన వారికి వేలకొద్దీ అవకాశాలు లభిస్తున్నాయి. కానీ మాకు ఏ హక్కులు లేవా? ఇన్నేళ్లలో నేను ఇంతవరకు రాజకీయాల గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అయితే ఒక్క విషయం.. 2012లో ఎవరైతే నా కూతురి కోసం వీధుల్లోకి వచ్చి నిరసనలు చేశారో.. ఈ రోజు వాళ్లే నా కూతురి చావును అడ్డం పెట్టుకుని రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నారు. 2014లో అధికారంలోకి వస్తే మహిళలపై దాడులు జరగవని చెప్పారు. రెండోసారి కూడా అధికారం చేపట్టి వేల కొద్దీ పనులు చేశారు. ట్రిపుల్‌ తలాక్‌ వంటి కీలక అంశాల్లో నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా నా కూతురి విషయంలో కూడా త్వరగా నిర్ణయం తీసుకునేలా చర్యలు తీసుకోండి. చేతులు జోడించి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను’’ అని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఇక నిర్భయ తల్లి ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే ముఖేష్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.(ఉరితాడుతో తాళి బొట్టు)

చదవండి: నిర్భయ కేసు సంబంధిత కథనాలు

తనను రక్తపు మడుగులో చూశా.. బండరాయిని

‘నా కూతురు బతికిలేదు.. చాలా సంతోషం’

సరిగ్గా ఏడేళ్లు.. కానీ ఆ బస్టాప్‌ వద్ద ఇంకా..
 

మరిన్ని వార్తలు