ఎన్‌కౌంటర్‌పై స్పందించిన నిర్భయ తల్లి

6 Dec, 2019 09:15 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దిశ అత్యాచార ఘటనపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవడంతో కేసు విచారణలో పోలీసులు ప్రత్యేక దృష్టిని సారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విచారణలో భాగంగా దిశ మృతదేహాన్ని కాల్చిన చటాన్‌పల్లి అండర్‌పాస్‌ ప్రాంతంలో క్రైమ్‌ సీన్‌ను రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో నలుగురు నిందితులను పోలీసులు కాల్చిచంపారు. తాజా ఘటనపై నిర్భయ తల్లి ఆశాదేవి స్పందించారు. దిశకు న్యాయం జరిగింది, కానీ నిర్భయ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

‘దిశ చనిపోయిన ఎనిమిది రోజుల్లోనే పోలీసులు న్యాయం చేశారు. కానీ నా బిడ్డ చనిపోయి ఏడేళ్లు అవుతోంది. అయినా కనీస న్యాయం జరగలేదు. ఏడేళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. ఉరిశిక్ష పడింది కానీ అది ఇంత వరకు అమలు కాలేదు. శిక్ష అమలు జరిగే వరకు పోరాడుతూనే ఉంటా. దిశ కేసులో పోలీసుల తీరును స్వాగతిస్తున్నా. ఎన్‌కౌంటర్‌ జరిపిన పోలీసులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలను తీసుకోవద్దు. ఆమె ఆత్మకు ఎట్టకేలకు శాంతి జరిగింది’ అని అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో 2012 డిసెంబర్‌ 15న నిర్భయపై  ఆరుగురు వ్యక్తులు అత్యాచారం జరిపిన విషయం తెలిసిందే. అనంతరం చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. దీనిపై విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు నిందితులకు ఉరిశిక్ష విధించగా.. నిందితుల్లో ఒకరైన రామ్‌సింగ్‌ జైల్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

చదవండి:

దిశ నిందితుల ఎన్కౌంటర్

దిశను చంపిన దగ్గరే ఎన్కౌంటర్..

మా బిడ్డకు న్యాయం జరిగింది: దిశ తల్లిదండ్రులు

>
మరిన్ని వార్తలు