పీఎం కేర్స్ ఫండ్‌ : నిర్మలా సీతారామన్ సాయం

3 Apr, 2020 15:42 IST|Sakshi
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (ఫైల్ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ: కరోనాపై పోరులో భాగంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చి పిలుపునకు కార్పొరేట్ దిగ్గజాలతో పాటు, పలువురు సెలబ్రిటీలు స్పందించి తమ వంతుగా విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా తన వంతుగా పీఎం నిధికి విరాళ మిస్తున్నట్టుగా ప్రకటించారు. తన జీతం నుండి లక్ష రూపాయలు విరాళాన్ని పీఎం కేర్స్ ఫండ్‌కు అందించినట్టు శుక్రవారం ప్రకటించారు. ఏప్రిల్ 1 న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగ్ భవన్ శాఖకు తన ఖాతా నుండి లక్ష రూపాయలు డెబిట్ చేసి, పిఎం కేర్స్ ఫండ్‌కు క్రెడిట్ చేయాలంటూ ఒక లేఖ రాశారు.

కరోనావైరస్ నివారణ, బాధితులకు సాయం తదితర అవసరాల నిమిత్తం ప్రధాని మోదీ పీఎం కేర్స్ ఫండ్ తో ఒక నిధిని ప్రారంభించారు. ఈ సంక్షోభ సమయంలో ప్రజలందరూ ముందుకు వచ్చి ఎంత చిన్న మొత్తంగానైనా విరివిగా సాయం చేయాలని పిలుపునిచ్చారు. దీంతో పలు కంపెనీలు, సీఈఓలు, సెలబ్రిటీలు ఈ ఫండ్‌కు విరాళాలు ప్రకటించారు. ముఖ్యంగా ఆర్‌ఐఎల్, పేటీఎంలు రూ .500 కోట్లు, కోల్ ఇండియా రూ .220 కోట్లు, హెచ్‌డిఎఫ్‌సి గ్రూప్ రూ .150 కోట్లు, ఉదయ్ కోటక్ రూ .50 కోట్లు ప్రకటించారు.  బాలీవుడ్ ప్రముఖులు అక్షయ్ కుమార్, అనుష్క శర్మ, లతా మంగేష్కర్, కరీనా కపూర్ ఖాన్ తదితరులు కూడాఈ పీఎం నిధికి అండగా నిలిచారు. అలాగే 51 కోట్ల రూపాయల విరాళాన్ని బోర్డ్ ఆఫ్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు