కరోనా : ఆర్థిక ప్యాకేజీకి కేంద్రం సిద్ధం!

24 Mar, 2020 13:18 IST|Sakshi

మరో గంటలో ఆర్థిక మంత్రి వీడియో కాన్ఫరెన్స్

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు ( మంగళవారం ) మధ్యాహ్నం 2 గంటలకు  మీడియాను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కోవిడ్ -19 వ్యాప్తి కారణంగా జరిగిన నష్టాలపై దేశానికి సహాయపడటానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీని సిద్ధం చేస్తోందని నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడుతానని తెలిపారు. ఆర్థిక ప్యాకేజీకి సంబంధించి ఆర్థికమంత్రి త్వరలోనే ప్రకటన చేయనున్నారు. చట్టబద్దమైన, నియంత్రణ  చర్యలతో ఆర్థిక మంత్రి  దేశ ప్రజలకు ఆర్థికంగా ఊరట కల్పించనున్నారని మార్కెట్ వర్గాలు భావిస్తున్నారు. లాభాల్లోఉన్నప్పటికీ, తీవ్ర ఒడిదుడుకుల మద్య సాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ అంచనాలతో భారీగా  పుంజుకున్నాయి.

మరోవైపు కరోనా వ్యాప్తిపై దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈరోజు రాత్రి 8గంటలకు జాతినుద్దేశించిన ప్రసంగించనున్నారు. కరోనా ఆందోళన నేపథ్యంలో ప్రజలకు  సూచనలు చేయనున్నారు. ఇప్పటికే లాక్‌డౌన్, కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలివ్వడం, లాక్‌డౌన్‌లను సీరియస్‌గా తీసుకోవాలంటూ ప్రధాని ట్వీట్ చేశారు. కాగా దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 500 మార్క్ ను తాకగా, మృతుల సంఖ్య 10కి చేరింది.

మరిన్ని వార్తలు