నిత్యానందకు కర్ణాటక కోర్టు షాక్‌

11 Sep, 2018 13:00 IST|Sakshi
నిత్యానంద (ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ: అత్యాచారం కేసులో నిందితుడు వివాదాస్పద నిత్యానంద స్వామికి (45) కోర్టు షాకిచ్చింది. గత రెండు నెలలుగా కోర్టుగా గైర్హాజరువుతున్న నిత్యానందకు క‌ర్ణాట‌క‌లోని రామ‌న‌గ‌ర సెషన్స్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అత్యాచారం కేసు విచారణకు రాకుండా నిత్యానంద స్వామి పరారీలో ఉన్నాడని కోర్టు పేర్కొంది. ఈ సారి కోర్టు విచారణకు ఆయ‌న తప్పకుండా హాజరు కావాలని సెషన్స్ కోర్టు జడ్జి ఆదేశించారు.

బెంగ‌ళూరు స‌మీపంలోని బిడ‌ది ఆశ్ర‌మంల కూడా నిత్యానంద ఆచూకీ లభ్యం కాలేదని, దీంతో ఈ వారెంట్‌ జారీ చేశామని దర్యాప్తు అధికారి హొన్నప్ప తెలిపారు.  నిందితుడు ఎక్కడ ఉన్నదీ విచారిస్తున్నామనీ, అనంతరం తదుపరి చర్యలతీసుకుంటామని చెప్పారు. అయితే వారణాసిలో చాతుర్మాస దీక్షలో ఉన్నకారణంగా కోర్టుకు హాజరు కాలేకపోయారని నిత్యానంద తరపు న్యాయవాది వాదించారు.

కాగా ఎనిమిదేళ్ల క్రితం అత్యాచారం, తదితర కేసులో నిత్యానంద స్వామిపై ఎఫ్ఐఆర్ న‌మోదైంది. తనపై నిత్యానంద లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళ ఫిర్యాదుతో 2010 లో ఎఫ్ఐఆర్ నమోదు కాగా ఏప్రిల్‌లో అరెస్ట్‌ అయిన నిత్యానందకు, బెయిల్‌ లభించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ కేసులో పలు కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. 2017లో ఆయనతో పాటు అత్యాచార కేసులో భాగస్వాములుగా ఉన్న మరో ఐదుగురి పిటిషన్‌లను కూడా సుప్రీం కోర్టు తిరస్కరించింది. దీంతో 2018 జూన్‌లో విచారణ ప్రారంభమైంది. అలాగే మూడవ నిందితుడు నిత్యా సచ్చిదానంద, రెండవ నిందితుడు గోపాల్ రెడ్డికి కూడా నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేయగా, విచారణకు సహకరించకుండా ఆగస్టు 8 నుంచి తప్పించుకుని తిరుగుతున్నారని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు