నీతి ఆయోగ్‌ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌

28 Apr, 2020 13:07 IST|Sakshi

ఢిల్లీ : ఢిల్లీలోని నీతి ఆయోగ్ ఆఫీసులో ప‌నిచేస్తున్న ఉద్యోగికి మంగళవారం కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అప్రమత్తమైన నీతి ఆయోగ్‌ అధికారులు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు ప్రోటోకాల్ పాటిస్తున్నారు. ప్ర‌స్తుతం ఉద్యోగులు పనిచేస్తున్నబిల్డింగ్‌ను సీజ్ చేశారు. రెండు రోజుల పాటు ఆ బిల్డింగ్‌లో శానిటైజేష‌న్ డ్రైవ్ నిర్వ‌హించ‌నున్నారు. ఈ విష‌యాన్ని నీతి ఆయోగ్ డిప్యూటీ సెక్ర‌ట‌రీ అజిత్ కుమార్ ట్విటర్‌ ద్వారా పేర్కొన్నారు.' నీతి ఆయోగ్‌లో పనిచేస్తున్న ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలిందని ఉదయం 9గంటలకు మా దృష్టికి వచ్చింది. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాల ప్ర‌కారం నీతి ఆయోగ్‌ భవనాన్ని మూసివేస్తున్నాం. పాజిటివ్ వ‌చ్చిన అధికారితో ట‌చ్‌లో ఉన్న‌ వారిని హోమ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లాల‌ని ఆదేశించామని' అధికారి తెలిపారు.

కాగా దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,543 కరోనా కేసులు నమోదుకాగా, 62 మంది మృతిచెందారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో ఇండియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,435కి చేరింది. ఇప్పటివరకు 6,869 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 934 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 21,632 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

>
మరిన్ని వార్తలు