పెట్రోల్‌ ధర రూ 50కి దిగిరావాలంటే..

11 Sep, 2018 13:43 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్‌ ధరలు లీటర్‌కు రూ 55, డీజిల్‌ రూ 50కి దిగిరావాలంటే బయో ఇంధనానికి మళ్లాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. వరి, గోధుమ, చెరకు వ్యర్థాలతో పాటు మున్సిపల్‌ వ్యర్థాలతో ఇంధనాన్ని తయారుచేసే ఐదు ఇథనాల్‌ ప్లాంట్లను పెట్రోలియం మంత్రిత్వ శాఖ నెలకొల్పుతుందని వీటి ఉత్పత్తులు బయటికి వస్తే పెట్రో ధరలు గణనీయంగా దిగివస్తాయని మంత్రి చెప్పుకొచ్చారు.

ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకంతో పెట్రోల్‌, డీజిల్‌పై ఆధారపడటం తగ్గుతుందని అన్నారు. చత్తీస్‌గఢ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి బయో ఇంధనాల ప్రాధాన్యత గురించి నొక్కిచెప్పారు. చత్తీస్‌గఢ్‌లోని జత్రోపా ప్లాంట్‌లో తయారైన బయో ఇంధనాన్ని ఉపయోగించి తొలి బయో ఇంధన విమానం ఇటీవల డెహ్రాడూన్‌ నుంచి ఢిల్లీలో ల్యాండయిందన్నారు. బయో ఇంధన ఉత్పత్తి ద్వారా రైతులు, గిరిజనులు, యువతకు ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు.

మరిన్ని వార్తలు