పెరోల్‌ విఙ్ఞప్తిపై సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

4 Nov, 2019 13:15 IST|Sakshi

న్యూఢిల్లీ : హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న యూపీ మాజీ మంత్రి ధరమ్‌పాల్‌ యాదవ్‌ తనయుడు వికాస్‌ యాదవ్‌ పెరోల్‌ విఙ్ఞప్తిపై సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అతనికి విధించిన 25 సంవత్సరాల శిక్ష పూర్తి చేయాల్సిందేనని, పెరోల్‌ సాధ్యం కాదని స్పష్టం చేసింది. పెరోల్‌ పొందడం తన క్లైంట్‌ ప్రాథమిక హక్కు అని అడ్వొకేట్‌ వాదించగా.. ‘అతనొక దోషి. మళ్లీ హక్కుల వాదన ఎక్కడిది’ అని పేర్కొంది. కాగా, యూపీకి చెందిన బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌ నితీష్‌ కటారా (25)ను హతమార్చిన కేసులో వికాస్‌ 2002 నుంచి శిక్ష అనుభవిస్తున్నాడు. తన సోదరి భారతీ యాదవ్‌తో నితీష్‌ డేటింగ్‌ చేస్తున్నాడనే కోపంతో అతన్ని దారుణంగా హతమార్చాడు. పెళ్లి మండపం నుంచి నితీష్‌ను ఎత్తుకెళ్లిన వికాస్‌, విశాల్‌ అతన్ని హత్య చేశారు. వీరిద్దరికీ 2002లో ఢిల్లీ హైకోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించగా.. 2016లో సుప్రీం తలుపు తట్టారు. వారి శిక్షను 25 ఏళ్లకు తగ్గిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

మరిన్ని వార్తలు