కేంద్ర ఉద్యోగుల ఎల్‌టీసీపై డీఏ కట్‌

22 Sep, 2017 01:36 IST|Sakshi
కేంద్ర ఉద్యోగుల ఎల్‌టీసీపై డీఏ కట్‌

న్యూఢిల్లీ:  సెలవు ప్రయాణ రాయితీ(ఎల్‌టీసీ) సదుపాయం పొందుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆయా ప్రయాణ రోజుల్లో రోజువారీ భత్యాన్ని(డీఏ) పొందలేరని కేంద్ర సిబ్బంది శిక్షణా సంస్థ(డీవోపీటీ) తెలిపింది. దీంతోపాటు ఉద్యోగుల స్థానిక ప్రయాణాలకు ఎల్‌టీసీ వర్తించదని పేర్కొంటూ డీవోపీటీ ఉత్తర్వులు జారీచేసింది. ఎల్‌టీసీ ప్రకారం సొంత నగరానికి, వేరే ప్రాంతాలకు వెళ్లే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిబంధనల మేరకు సెలవులు ఇవ్వడంతో పాటు వారి టికెట్‌ ఖర్చుల మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. వీరి హోదాను బట్టి గతంలో డీఏ కూడా ఇచ్చేవారు. తాజాగా ఈ సదుపాయాన్ని రద్దు చేస్తూ డీవోపీటీ నిర్ణయం తీసుకుంది.

అంతేకాకుండా ్రíపీమియం, సువిధా, తత్కాల్‌ రైళ్లలో ప్రయాణించే ప్రభుత్వ ఉద్యోగుల టికెట్‌ చార్జీలను రీయింబర్స్‌ చేస్తామని డీవోపీటీ తెలిపింది. వీటితో పాటు రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లల్లో డిమాండ్‌కు అనుగుణంగా పెరిగే చార్జీలను ఎల్‌టీసీ పరిధిలోకి తెచ్చామంది. అయితే విమాన ప్రయాణానికి ఎల్‌టీసీ అనుమతి లేని ఉద్యోగులు విమాన ప్రయాణం చేసి.. తమకు అర్హత ఉన్న దురంతో, రాజధాని, శతాబ్ది రైళ్ల చార్జీలను రీయింబర్స్‌ ద్వారా పొందలేరని స్పష్టం చేసింది.

ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు నడిపే వాహనాలకే ఎల్‌టీసీ వర్తిస్తుందంది. ఒకవేళ ప్రభుత్వ రవాణా వ్యవస్థలు అందుబాటులో లేకుంటే గరిష్టంగా 100 కి.మీ వరకు ప్రైవేటు లేదా వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించవచ్చని, 100 కి.మీ. దాటితే తర్వాత ఖర్చులను సదరు ఉద్యోగే వ్యక్తిగతంగా భరించాల్సి ఉంటుంది. ఏడవ పే కమిషన్‌ సిఫార్సుల అధారంగానే తీసుకున్న ఈ నిర్ణయాలు 2017, జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది.

మరిన్ని వార్తలు