‘సినిమాలకు, మాల్స్‌కు వెళ్లే కోడలొద్దు’

12 Jun, 2017 20:07 IST|Sakshi



పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రబ్రీదేవి...కోడలు కోసం వెతుకులాటలో బిజీబిజీగా ఉన్నారు. పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ కు సరిజోడిగా సంప్రదాయబద్ధమైన వధువు కోసం లాలూ దంపతులు  సంబంధాలు చూస్తున్నారు.  అంతేకాకుండా ఎలాంటి కట్నకానుకలు లేకుండా హోమ్లీగా ఉండి, తమతో చక్కగా కలిసిపోయే అమ్మాయి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.

లాలూ పుట్టినరోజు సందర్భంగా రబ్రీదేవీతో కొడుకు పెళ్లి గురించి పలువురు విలేకర్లు అడగగా, తమకు పద్ధతైన, ఇంటిని చక్కదిద్దుకునే అమ్మాయి కోడలుగా కావాలే కానీ, సినిమాలకు, షాపింగ్ మాల్స్ కు తిరిగే అమ్మాయిలు వద్దని అన్నారు. తాము చాలా సంబంధాలు చూసామని, అలాగే చాలా పెళ్లి ప్రదిపాదనలు వచ్చినట్లు తెలిపారు. అయితే తేజ్ ప్రతాప్ కు సరైన జోడీ ఇంకా దొరకలేదన్నారు.

ఇదే విషయంపై లాలూ మాట్లాడుతూ ..తమ ఇంటికి వచ్చే కోడలు..దేశంలోని ఏ ప్రాంతంవారైనా కావచ్చని, అంతేకాకుండా తాము పైసా కట్నం తీసుకోమని ఆయన తెలిపారు. అయితే ఓ ఆవుకు మాత్రం మినహాయింపు ఉందని తెలిపారు. కాగా తన కుమారుడికి కాబోయే భార్యను లాలూ యూపీలోని రాజకీయ కుటుంబం నుంచే ఎంపిక చేయనున్నట్లు సమాచారం. లాలూ ప్రసాద్‌కు ఏడుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. వీరిలో తేజ్‌ ప్రతాప్‌ర్‌ ప్రస్తుతం ఆర్యోగ, అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

లాలూ నాలుగో కుమార్తె రజినీ... ఎస్పీ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర యాదవ్‌ కుమారుడు రాహుల్‌ యాదవ్‌ను వివాహం చేసుకున్నారు. అలాగే ఆయన చివరి కుమార్తె రాజ్‌ లక్ష్మీని యూపీ మాజీ సీఎం ములాయం సింగ్‌ యాదవ్‌ మనవడు, ఎంపీ తేజ్‌ ప్రతాప్‌ సింగ్‌తో వివాహం జరిపించారు. ఇ​క లాలూ పెద్ద కుమార్తె మీసా భారతి రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నారు.

మరిన్ని వార్తలు