వారికి క్షమాభిక్ష కోరే అర్హత లేదు

7 Dec, 2019 03:25 IST|Sakshi
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

రాష్ట్రపతి కోవింద్‌ కీలక వ్యాఖ్యలు

మౌంట్‌ అబూ: మహిళలపై జరుగుతున్న వరుస పైశాచిక దాడులు దేశాన్ని వణికిస్తున్నాయని, నైతికంగా దెబ్బ తీస్తున్నాయని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు.  రాజస్తాన్‌లోని అబూరోడ్‌లో బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో మహిళా సాధికారతపై శుక్రవారం జరిగిన జాతీయ సదస్సులో రాష్ట్రపతి ప్రసంగించారు. లైంగిక వేధింపులు, దాడుల నుంచి చిన్నారుల్ని రక్షించడానికి తీసుకువచ్చిన ది ప్రొటక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌ (పోక్సో) చట్టం కింద ఉరిశిక్ష పడిన వారికి క్షమాభిక్ష కోరే హక్కు లేకుండా పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఉందని అన్నారు. 

హైదరాబాద్‌లో దిశ హత్యాచారం, ఉన్నావ్‌లో అత్యాచార బాధితురాలిని  తగులబెట్టడం వంటి ఘటనల నేపథ్యంలో రాష్ట్రపతి మహిళల భద్రత గురించి మాట్లాడడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘అత్యాచార నేరాల్లో ఉరి శిక్ష పడిన వారందరూ క్షమాభిక్ష కోరుతూ పిటిషన్లు దాఖలు చేస్తారు. వారికి రాజ్యాంగం ఆ హక్కుని కల్పించింది. అయితే పోక్సో చట్టం కింద శిక్ష పడిన వారికి ఆ హక్కు ఉండకూడదు. ఆ దిశగా కేంద్రం అడుగులు వెయ్యాలి. చట్టాలను పునఃసమీక్షించాలి’అని సూచించారు. నిర్భయ గ్యాంగ్‌ రేప్‌ దోషి క్షమాభిక్ష పెట్టుకున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


‘దిశ’ ఘటన నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చడాన్ని అభినందిస్తూ ప్రముఖ కళాకారుడు సుదర్శన్‌ పట్నాయక్‌ పూరీ బీచ్‌లో రూపొందించిన సైకత శిల్పం

మరిన్ని వార్తలు