గాంధీని గాడ్సేనే చంపాడు

9 Jan, 2018 03:41 IST|Sakshi

న్యూఢిల్లీ: గాంధీజీ హత్య కేసును తిరిగి విచారించాల్సిన అవసరం లేదని ఈ కేసులో అమికస్‌ క్యూరీగా(న్యాయ సహాయకుడు) వ్యవహరిస్తోన్న సీనియర్‌ న్యాయవాది అమరేందర్‌ సుప్రీంకోర్టుకు తెలిపారు. గాంధీపై నాథురాం గాడ్సేనే కాల్పులు జరిపాడని, ఈ కేసులో బ్రిటిష్‌ ప్రత్యేక నిఘా విభాగం పాత్ర ఉందన్న ఆరోపణలు నిరూపితం కాలేదని కోర్టుకు ఆయన నివేదిక సమర్పించారు. నివేదికను పరిశీలించిన జస్టిస్‌ బాబ్డే నేతృత్వంలోని బెంచ్‌ విచారణను వాయిదా వేసింది.

నాథురాం గాడ్సే తుపాకీతో కాల్చి గాంధీజీని హత్య చేయగా.. గాడ్సేతో పాటు కేసుతో ప్రమేయమున్న నారాయణ్‌ ఆప్టేకు కోర్టు ఉరిశిక్ష విధించింది. 1949 నవంబర్‌లో వారిద్దరిని ఉరి తీశారు. గాంధీ హత్యలో వేరే వ్యక్తి ప్రమేయం ఉందని ఆరోపిస్తూ.. ముంబై పరిశోధకుడు పంకజ్‌ ఫడ్నీస్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిల్‌పై విచారణ చేపట్టిన కోర్టు కేసులో న్యాయసలహా కోరుతూ అమరేందర్‌ శరణ్‌ను అమికస్‌ క్యూరీగా నియమించింది.

మరిన్ని వార్తలు