లాక్‌డౌన్‌ను పొడిగించం: కేంద్రం

30 Mar, 2020 11:01 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన 21రోజుల లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగిస్తారనే వార్తలను కేంద్రం కొట్టిపారేసింది. లాక్‌డౌన్‌ గడువు పెంచుతారన్న వదంతులు అవాస్తమని తేల్చిచెప్పింది. ఈ మేరకు సోమవారం కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా స్పందించారు. దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ 21 రోజులేనని స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ పెంపు వార్తలు అవాస్తవం, నిరాధారమన్నారు. కాగా,  కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు 21 రోజుల దేశ వ్యాప్త లాక్‌డౌన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కరోనా చైన్‌ను తెంచడానికే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన పేర్కొన్నారు. ప్రజలు తమ ప్రయాణాలను మానుకోవాలని, ఎక్కడివారు అక్కడే ఉండిపోవాలని విజ్ఞప్తి చేశారు. ( కరోనా 'లాక్‌డౌన్‌'పై సీరియస్‌నెస్‌ ఏదీ? )

ఆదివారం ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో మరోసారి లాక్‌డౌన్‌ గురించి మోదీ మాట్లాడుతూ.. ప్రజలను ఇబ్బంది పెట్టే (ముఖ్యంగా పేద ప్రజల్ని) నిర్ణయం తీసుకున్నందుకు క్షమాపణ కోరారు. కరోనాను అదుపు చేసేందుకు ఇంతకంటే మంచి మార్గం​ లేదని, ప్రజలు తనను తప్పకుండా క్షమిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌లో ఇప్పటి వరకు 1071 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా,  29 మంది మృత్యువాత పడ్డారు. 


 

మరిన్ని వార్తలు