ప్రైవేట్‌ కాదు... ఔట్‌ సోర్సింగే

23 Nov, 2019 02:18 IST|Sakshi

రాజ్యసభలో రైల్వేమంత్రి గోయల్‌ వెల్లడి

న్యూఢిల్లీ: రైల్వేలను ప్రైవేటీకరించబోవడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రయాణికులకు మెరుగైన సేవల్ని అందించడం ప్రైవేటు వ్యక్తులకు ఔట్‌సోర్సింగ్‌కు ఇస్తున్నట్టుగా రైల్వే  మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు. శుక్రవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. భారీ స్థాయిలో రైల్వేలను ప్రైవేటీకరించే ఉద్దేశమే లేదన్నారు. ప్రైవేటు వ్యక్తులకు రైళ్లను నడిపే బాధ్యతలు అప్పగిస్తామని  వాటి భద్రతపై కేంద్రానిదే బాధ్యతని స్పష్టం చేశారు. లక్నో–ఢిల్లీ మధ్య నడిచే తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించి రైల్వే ఆన్‌లైన్‌ టిక్కెట్‌ బుకింగ్‌ వ్యవస్థ ఐఆర్‌సీటీసీ, దానికి అనుబంధంగా ఉన్న టూరిజం, కేటరింగ్‌ వంటివన్నీ ప్రైవేటు వ్యక్తులకు ప్రయోగాత్మకంగా అప్పగించిన విషయం తెలిసిందే. ఇటీవల నీతి ఆయోగ్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వం 150 రైళ్లు, 50 రైల్వే స్టేషన్లను నడపడానికి పరిమిత కాలానికి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి సిద్ధమైంది.   

12 ఏళ్లలో రూ.50 లక్షల కోట్లు ఖర్చు  
రైల్వే వ్యవస్థను సజావుగా నడపాలంటే వచ్చే 12 ఏళ్లలో రూ. 50 లక్షల కోట్లు అవసరం ఉంటుందని, అంత బడ్జెట్‌ కేటాయించడానికి పరిమితులుంటాయని గోయల్‌ అన్నారు. ప్రయాణికులకు అత్యంత ఆధునిక సౌకర్యాలు కల్పించడమే కేంద్రం లక్ష్యం. .కానీ రైల్వేల భద్రత అంతా కేంద్రం చేతుల్లోనే ఉంటుందని వివరించారు.  

ప్రైవేటు పెట్టుబడులు మంచివే..
రైలు ప్రయాణికుల సంఖ్య పెరిగిపోతోందని వారందరికీ సదుపాయాలు కల్పించాలంటే కొత్త రైళ్లు నడపాలని, లైన్లు వేయా లని, ఇదంతా కేంద్ర ప్రభుత్వానికి శక్తికి మించిన భారమని గోయల్‌ అన్నారు. రైల్వే వ్యవస్థలో ప్రైవేటు వ్యక్తులెవరైనా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే మంచిదేనన్నారు.

మరిన్ని వార్తలు