మా ఎమ్మెల్యేలు మాతోనే..

19 Jul, 2014 22:21 IST|Sakshi

న్యూఢిల్లీ: తమ ఎమ్మెల్యేలలో కొందరు బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తారన్న ఆప్ ఆరోపణలను కాంగ్రెస్ తోసిపుచ్చింది. ఈ మేరకు డీపీసీసీ కార్యాలయంలో నేతృత్వంలోని శనివారం నిర్వహించిన మీడియా సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. ‘మా పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఐక్యంగా ఉన్నారు. దేశంలోని మాది అత్యంత పురాతన పార్టీ. మేం బీజేపీ లేదా ఆప్‌కు సహకరించే ప్రశ్నే లేదు’ అని లవ్లీ స్పష్టం చేశారు. ఈ రెండు పార్టీలు నాణేనికి బొమ్మాబొరుసు వంటివాటివని, దేనికీ తాము మద్దతు ఇవ్వబోమని తేల్చిచెప్పారు. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు బదులు తాజాగా ఎన్నికలు నిర్వహించడమే తమకు సమ్మతమని లవ్లీ అన్నారు.
 
 తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మద్దతు ఇవ్వడానికి ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్టు బీజేపీ నాయకులు కొందరు ఇటీవల ప్రకటించారు. ఆకాలీదళ్ ఎమ్మెల్యే కూడా తమ వెంటే ఉంటారని తెలిపారు. ప్రస్తుతం బీజేపీకి 28 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ప్రభుత్వ ఏర్పాటుకు మరో ఆరుగురి మద్దతు అవసరం ఉంటుంది. అకాలీదళ్ బీజేపీకి మిత్రపక్షమే కాబట్టి మరో ఐదుగురు సభ్యుల మద్దతు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో లవ్లీ పైవివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఆప్ అగ్రనాయకుడు అరవింద్ కేజ్రీవాల్‌పైనా విరుచుకుపడ్డారు. బీజేపీ తమ ఎమ్మెల్యేలను రూ.20 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తోందని ఆరోపించడం ద్వారా ఆయన నీతిబాహ్య రాజకీయాలకు పాల్పడ్డారని విమర్శించారు.
 
 ‘ఆరోపణలు చేసి ఊరుకోవడం కేజ్రీవాల్ విధానం. తదనంతరం వాటిని నిరూపించేందుకు ఎటువంటి ఆధారాలూ చూపరు. తాజాగా ఎన్నికలు నిర్వహిస్తే ఢిల్లీవాసులు ఆప్‌కు గుణపాఠం చెబుతారే కాబట్టే ఆయన ఇలాంటి నీతిమాలిన ఆరోపణలు చేస్తున్నారు’ అని మండిపడ్డారు. కాంగ్రెస్ సభ్యుల మద్దతుతో మరోసారి ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆప్ ప్రయత్నిస్తోందని ఎమ్మెల్యే మతీన్ అహ్మద్ ఈ సందర్భంగా అన్నారు. తామంతా ఐక్యంగా ఉన్నామని ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వబోమని స్పష్టీకరించారు. మరో బీజేపీ ఎమ్మెల్యే ఒకరు శుక్రవారం మాట్లాడుతూ ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలు తనను సంప్రదించారని ఆయన విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు తమ అధిష్టానానికి ఇష్టం లేదన్నారు.

>
మరిన్ని వార్తలు