పీఎఫ్ డ్రా చేసినా టీడీఎస్ ఉండదు!

31 May, 2016 09:06 IST|Sakshi
పీఎఫ్ డ్రా చేసినా టీడీఎస్ ఉండదు!

పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త. జూన్ ఒకటో తేదీ నుంచి మీ పీఎఫ్‌లోంచి రూ. 50 వేల వరకు డ్రా చేసుకున్నా, దానిమీద ఎలాంటి పన్ను కోత వేయరు. ప్రస్తుతం ఈ పరిమితి రూ. 30వేల వరకు మాత్రమే ఉండగా దాన్ని రూ. 50 వేలకు పెంచుతూ ప్రభుత్వం నోటిఫై చేసింది. ఉద్యోగులు ముందుగానే పీఎఫ్‌లో సొమ్ము విత్‌డ్రా చేయకుండా ఉండేందుకు, రిటైర్మెంట్ సమయంలో ఎక్కువ మొత్తం చేతికి వచ్చేలా ఉండేందుకు పీఎఫ్‌ విత్‌డ్రాలపై పన్ను విధించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

అయితే, సభ్యులు 15జి లేదా 15హెచ్‌ ఫారం సమర్పిస్తే ఈ పన్ను ఉండదు. ఈ మొత్తం అందుకున్న తర్వాత కూడా తమ వార్షికాదాయం ఆదాయపన్ను పరిమితి లోపలే ఉంటుందని ఈ ఫారాల ద్వారా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. వీటిలో 15జి 60 ఏళ్ల లోపువారికి, 15హెచ్ 60 ఏళ్లు దాటినవారికి వర్తిస్తాయి. పీఎఫ్‌లో ఉన్న మొత్తాన్ని ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు బదిలీ చేస్తే పన్ను విధించరు. అలాగే, ఉద్యోగులు ఐదేళ్ల తర్వాత పీఎఫ్ విత్‌డ్రా చేసినా పన్ను విధించకూడదని చట్టం చెబుతోంది.

>
మరిన్ని వార్తలు