ఆ నలుగురు కూతుళ్లు ఇలా చేశారేంటి?

12 Nov, 2017 10:34 IST|Sakshi

నోయిడా : కొడుకులు లేకపోవటంతో తన కోరికను మీరే తీర్చాలంటూ తన నలుగురు కూతుళ్లను కోరాడు ఆ తండ్రి. దాన్ని బాధ్యతగా స్వీకరించిన వాళ్లు అది నెరవేర్చగా.. వాళ్లు చేసిన పనిని రోడ్డున పోయేవాళ్లంతా నోళ్లు వెళ్లబెట్టి చూడసాగారు. ఇంతకీ అంతగా వైరల్‌ అయ్యేలా వాళ్లు ఏం చేశారో చూడండి...

ప్రిన్స్‌ గుట్కా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ యాజమాని అయిన హరీ భాయ్‌ లాల్వానీ(65) అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. మనిషి జీవితంలో పుట్టినరోజు ఎంత ముఖ్యమో.. చావు రోజు కూడా అంతే ముఖ్యమన్నది ఆయన ఉద్దేశం. అందుకే అంతిమ యాత్రను కూడా అంతే అందంగా.. ఓ వేడుకలా జరుపుకోవాలని... తన విషయంలో అది జరిగితీరాలని కూతుళ్ల దగ్గర తరచూ ప్రస్తావించేవాడంట.

దీంతో శనివారం ఉదయం 10 గంటలకు సెక్టార్ 40లోని ఆయన ఇంటి ముందు నుంచి లాల్వానీ అంతిమ యాత్ర మొదలైంది. పూల అలంకరణ చేసిన వాహనం.. దాని ముందు ఆయన నలుగురు కూతుళ్లు.. వాళ్ల ముఖంలో చిరు నవ్వులు... హుషారుగా స్టెప్పులేస్తూ ముందుకు సాగారు. అలా సెక్టార్ 94 దాకా యాత్ర కొనసాగగా.. స్థానికులంతా నోళ్లు వెళ్లబెట్టి చూడసాగారు. ‘‘లోకమంతా మా గురించి ఏం అనుకున్నా ఫర్వాలేదు. మా తండ్రి చివరి కోరికను నెరవేర్చాం’’ అని ఆయన పెద్ద కూతురు  అనిత చెబుతున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. 

మరిన్ని వార్తలు