ఢిల్లీ నుంచి వచ్చే వాహనాలను అనుమతించం.. 

19 May, 2020 11:00 IST|Sakshi

న్యూఢిల్లీ : ఢిల్లీ, నోయిడాల సరిహద్దుల్లో వాహనాల రాకపోకలకు సంబంధించి యథాతథ స్థితి కొనసాగుతుందని నోయిడా అధికారులు తెలిపారు. అయితే గత రాత్రి లాక్‌డౌన్‌ 4.0 మార్గదర్శకాలు జారీచేసిన ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఢిల్లీ ప్రజలకు నోయిడా, ఘజియాబాద్‌ నగరాల్లోకి ప్రవేశం కల్పిస్తున్నట్టు తెలిపింది. అయితే ఢిల్లీలోని హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో నివసించేవారిని మాత్రం అనుమతించబోమని స్పష్టం చేసింది. 

ఈ నేపథ్యంలో ఢిల్లీ, నోయిడాల మధ్య రాకపోకలు సాగుతాయని అంతా భావించారు. అయితే నోయిడా అధికారులు మాత్రం పాస్‌లు ఉన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు యథాతథ స్థితి కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ఢిల్లీ, నోయిడా సరిహద్దులో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. (చదవండి : భారత్‌లో లక్ష దాటేసిన కరోనా కేసులు)

ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు వాహనదారులకు కీలక సూచనలు చేశారు. నోయిడా డిస్ట్రిక్‌ మేజిస్ట్రేట్‌ జారీచేసిన వాహనాలను మాత్రమే ఉత్తరప్రదేశ్‌ పోలీసులు నోయిడాలోకి అనుమతిస్తున్నారు. కనుక కలిండి కుంజ్‌ బ్యారేజ్‌ ఫ్లైఓవర్‌, డీఎన్‌డీ ఫ్లైఓవర్‌ మీదుగా నోయిడా వెళ్లే వాహనదారులు ఇందకు తగ్గట్టు వారి జర్నీ ప్లాన్‌ చేసుకోవాలి’ అని తెలిపారు. కాగా, దేశ రాజధాని ఢిల్లీ, దాన్ని అనుకుని ఉన్న నోయిడాల మధ్య భారీగా రాకపోకలు ఉంటాయనే సంగతి తెలిసిందే. తాజాగా లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ఆఫీసులు తెరుచుకోవడంతో ఉద్యోగులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. దీంతో లాక్‌డౌన్‌ 4.0 ప్రారంభమైన సోమవారం రోజున ఢిల్లీ, నోయిడా సరిహద్దుల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.(చదవండి : లాక్‌డౌన్‌ 4.0 : భారీగా ట్రాఫిక్‌ జామ్‌)

మరిన్ని వార్తలు