సాక్షి, న్యూఢిల్లీ : ఓ విద్యార్థి తండ్రికి కరోనా వైరస్ పాజిటివ్గా తేలడంతో నోయిడాలోని ఓ ప్రైవేట్ స్కూల్ మూడు రోజుల పాటు మూతపడింది. గత శుక్రవారం ఆగ్రాలో ఆ వ్యక్తి ఇచ్చిన బర్త్డే పార్టీలో స్కూల్ విద్యార్ధులకు సంబంధించిన పలు కుటుంబాలు పాల్గొనడంతో కరోనా వ్యాప్తిపై ఆందోళన నెలకొంది. సదరు వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడంతో హైస్కూల్ విద్యార్ధులకు పరీక్షలను రద్దు చేసిన పాఠశాల యాజమాన్యం స్కూల్ పరిసరాలను పరిశుభ్రం చేయడంతో పాటు పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేసింది.
కాగా బర్త్డే పార్టీలో పాల్గొన్న వారిలో ఆరుగురికి జ్వరం రావడంతో కరోనా నిర్ధారణ కోసం వారి రక్త నమూనాలను పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. మరోవైపు ఆ ఆరుగురితో సన్నిహితంగా మెలిగిన వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యారోగ్య అధికారులు పరిశీలిస్తున్నారు. కాగా, చైనాతోపాటు ప్రపంచ దేశాలను భయపెడుతున్న కోవిడ్-19 (కరోనా వైరస్) బాధితులు లక్షకు చేరువవడంతో డెడ్లీ వైరస్ వ్యాప్తిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 2019, డిసెంబర్ 31వ తేదీన చైనాలో తొలి కేసు బయట పడగా, నేటికి ఒక్క అంటార్కిటికా మినహా ప్రతి ఖండానికి వైరస్ విస్తరించింది.