పవన సరస్సులో అరుదైన చేప లభ్యం!

4 Dec, 2018 10:47 IST|Sakshi

సాక్షి, ముంబై : పుణె సమీపంలో గల పర్యాటక ప్రాంతం పవన సరస్సులో అరుదైన మాంసాహార చేపను కనుగొన్నట్లుగా పవన డ్యామ్‌ అధికారులు తెలిపారు. ఉత్తర అమెరికాలోని సముద్ర జలాల్లో ఎక్కువగా కనిపించే ఈ చేప పేరు ‘అలిగేటర్‌ గార్‌’  అని పేర్కొన్నారు. వివరాలు.. స్థానిక జాలర్లు కొన్ని రోజుల క్రితం పవన సరస్సు(కృత్రిమమైనది)లో చేపలు పట్టేందుకు వెళ్లగా అరుదైన చేప వారి గాలానికి చిక్కింది. దీంతో జాలర్లు ఫిషసరీస్‌ సంస్థ నిపుణుల వద్దకు తీసుకువెళ్లారు.

ఈ క్రమంలో ఈ చేపను పరిశీలించిన అధికారులు మాంసాహార చేపగా గుర్తించారు. 17 సెంటీమీటర్ల పొడవు, రెండున్నర కిలోల బరువు ఉన్న ఈ చేప ఇతర చేపలను, సముద్ర జీవులను తినడం ద్వారా మనుగడ సాగిస్తుందని తెలిపారు. ఇటువంటి చేపల వల్ల సముద్ర జీవవైవిధ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అయితే ఉత్తర అమెరికాలో లభించే ఈ చేప పవన సరస్సులోకి ఎలా వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. బహుషా ఎవరైనా బయటి వ్యక్తులు అక్వేరియంలో పెంచుకునేందుకు ఈ చేపను తెచ్చుకుని ఉంటారని, వారే దీనిని సరస్సులో వదిలి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఇతర సముద్ర జీవులకు హాని కలిగే అవకాశం ఉంది గనుక ఇటువంటి చేపల జాడ తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని జాలర్లకు సూచించారు.

మరిన్ని వార్తలు