నోట్ల రద్దుపై ఖాళీగా లేం..15 రోజుల్లో క్లియర్‌

9 Dec, 2016 15:30 IST|Sakshi
నోట్ల రద్దుపై ఖాళీగా లేం..15 రోజుల్లో క్లియర్‌
న్యూఢిల్లీ: పెద్దనోట్లను రద్దు చేస్తూ తాను తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. నోట్ల రద్దు చేసి మాత్రమే తాము ఊరుకోలేదని, ఏం చేయకుండా అసలే లేమని, మరో పది నుంచి పదిహేను రోజుల్లో అంతా సర్దుమణుగుతుందని కేంద్రం సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చింది. నోట్ల రద్దుతో సమాజంలో అశాంతి నెలకొందని ఎక్కడా ఒక్క కేసు కూడా నమోదుకాలేదని, కావాలనే కొన్ని రాజకీయ పార్టీలు వాస్తవాలను మించి తమ గొంతును వినిపిస్తూ అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించింది.

నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకునే నాటికి ప్రభుత్వం వద్ద ముందే సిద్ధం చేసిన కొత్త నోట్లేమీ లేవని, అసలు ముద్రించలేదని, అలా చేస్తే కేంద్రం నిర్ణయం లీకవుతుందనే అలా చేశామని పేర్కొంది. మరోపక్క, వారానికి రూ.24వేలు డ్రా చేసుకోవచ్చని ఆర్బీఐ చెప్పినప్పటికీ అంత మొత్తంలో ఇవ్వలేమని బ్యాంకులు చెప్తున్నాయని, ఈ పరిస్థితికి పరిష్కారం చూపించాలని మరికొందరు సుప్రీంలో పిటిషన్లు వేశారు. అయితే, ప్రతి ఒక్కరికి కొత్త నగదు అందాలనే ఉపసంహరణకు పరిమితి విధించినట్లు కేంద్రం తెలిపింది.

పెద్ద నోట్లను రద్దు చేయాలని ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని తాజాగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని రహస్యంగా ఉంచారా? బ్యాంకుల నుంచి వారానికి 24 వేల రూపాయలు మాత్రమే విత్‌ డ్రా చేయాలన్న పరిమితిని ఎందుకు విధించారని కూడా ప్రశ్నించింది. నగదు రద్దుకు, పరిమితికి సంబంధం ఏంటని వివరణ కోరింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు శుక్రవారం విచారించగా కేంద్రం తరపున అటార్నీ జనరల్‌ రోహత్గీ ఈ వాదనలు వినిపించారు. 
>
మరిన్ని వార్తలు