నేను ఆరోగ్యంగానే ఉన్నాను : అమిత్‌ షా

9 May, 2020 16:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ సోషల్‌ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన బోన్‌ క్యాన్సర్‌ బారినపడటంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని పెద్ద ఎత్తున పుకార్లు కూడా వచ్చాయి. అందుకే కరోనా సమయంలోనూ పెద్దగా మీడియా సమావేశాల్లోకి రావడంలేదంటూ నెట్టింట్లో చర్చ జరుగుతోంది. అయితే తనపై వస్తున్న పుకార్లపై అమిత్‌ షా ట్విటర్‌ వేదికగా స్పందించారు. తాను ఎలాంటి వ్యాధితో బాధపడటంలేదని, పూర్తిగా అరోగ్యంగా ఉన్నానంటూ బదులిచ్చారు. సోషల్‌ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను అమిత్‌ షా ఖండించారు. (మాజీ సీఎంకు గుండెపోటు.. పరిస్థితి విషమం)

‘ప్రస్తుతం దేశం చాలా క్లిష్ట సమయంలో ఉంది. ప్రజలంతా కరోనాపై యుద్ధం చేస్తున్నారు. దేశ హోంమంత్రిగా బాధ్యతాయుతంగా నాపనిలో నేను ఉన్నాను. గడిచిన రెండు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో నా ఆరోగ్యంపై అనేక వదంతులు వస్తున్నాయి. ఇలాంటివి ఎవరు, ఎందుకు చేస్తున్నారో అర్థం కావడంలేదు. వారందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. కానీ బీజేపీ కార్యకర్తలు, నా అభిమానులు  తప్పుడు వార్తలతో మనోవేదనకు గురువ్వకూడదని భావించాను. అందుకే వారందరికీ వివరణ ఇస్తున్నాను. నేను ఎలాంటి వ్యాధితో బాధపడటంలేదు. పూర్తిగా అరోగ్యంగా ఉన్నాను’ అని తన ట్విటర్‌ ఖాతా ద్వారా తెలిపారు.

మరిన్ని వార్తలు