రూ.2000 నోటు లాజిక్‌ నాకు తెలియదు

21 Mar, 2018 18:51 IST|Sakshi

సాక్షి, కోల్‌కతా : కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం పట్టణ మేధోవర్గాన్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయిందని ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణమూర్తి అన్నారు. అయితే, గ్రామీణ పౌర సమాజం మాత్రం పెద్ద మొత్తంలో ఈ నిర్ణయాన్ని స్వాగతించిందని చెప్పారు. అయితే, అప్పటికప్పుడు రూ.500 నోట్లను రద్దు చేసిన కేంద్రం వెంటనే అంతకంటే పెద్దదైన రూ.2000 నోటును ఎందుకు తీసుకొచ్చిందోనని, ఆ లాజిక్‌ తనకు ఇప్పటికీ అర్ధం కాలేదని చెప్పారు. బుధవారం ప్రెసిడెన్సీ యూనివర్సిటీలో విద్యార్థులతో మమేకమైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

'నేను ఆర్థికశాస్త్రంలో పెద్ద నిపుణుడిని కాదు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం పట్టణ మేథావులను పెద్దగా ఆకర్షించలేదు.. కానీ, గ్రామాల్లోని భారతీయులు మాత్రం బాగా స్వాగతించారు. పెద్ద నోట్ల నిర్ణయం ఎందుకు తీసుకొచ్చారో నాకు ఇప్పటకీ తెలియదు. నేను పెద్దగా నిపుణుడిని కానప్పటికీ ఒక సామాన్యుడిగా ఆలోచించినప్పుడు కొన్ని కారణాల రీత్యా రూ.500 నోట్లు రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం అంతే వేగంగా అంతకంటే పెద్దవైన రూ.2000 నోట్లను ఎందుకు తీసుకొచ్చిందో అన్న లాజిక్‌ నాకు ఇప్పటికీ అర్ధం కాలేదు. ఇలా ఎందుకు చేశారో నిపుణులు మాత్రమే సమాధానం చెప్పగలరు.. ఈ విషయం నిపుణులనే మీరు కూడా అడగండి. 1950 నుంచి జపాన్‌, చైనా మాదిరిగా భారత ఐటీ కంపెనీలు స్వల్పశ్రేణి తయారీరంగంపై దృష్టిపెట్టలేదు. మన దురదృష్టం కొద్ది దేశంలో 75శాతం చిన్నారులు స్కూల్‌కు వెళుతున్న వారిలో 8వ తరగతి చేరకముందే స్కూల్‌ మానేస్తున్నారు. వీరు 22 ఏళ్లకు చేరుకునే సరికి వారికి ఓ ఉపాధి కావాలి. వారికి స్వల్పశ్రేణి తయారీరంగంలోనే అది లభిస్తుంది. భారత్‌లో ఆ రంగం పెద్దగా అభివృద్ధి చెందలేదు. భారత ఆర్థికవేత్తలు ఈ అంశంపై దృష్టి సారించాలి' అని నారాయణమూర్తి తెలిపారు.

మరిన్ని వార్తలు