‘నవంబర్‌ 14 అంకుల్‌ డే..’ 

6 Apr, 2018 12:39 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బాలల దినోత్సవాన్ని నవంబర్‌ 14కు బదులు డిసెంబర్‌ 26న నిర్వహించాలని వంద మందికి పైగా బీజేపీ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. నవంబర్‌ 14న బాలల సంక్షేమం కంటే జవహర్‌లాల్‌ నెహ్రూకు చిన్నారులపై ప్రేమ గురించిన ప్రస్తావనే అధికమవుతోందని వారు ఆక్షేపించారు. మొఘలులకు వ్యతిరేకంగా గురు గోవింద్‌ సింగ్‌ మైనర్‌ కుమారులు షహిజద అజిత్‌ సింగ్‌ (18), జుజార్‌ సింగ్‌ (14), జోర్వార్‌ సింగ్‌ (9), ఫతే సింగ్‌ (7)ల ప్రాణ త్యాగానికి ప్రతీకగా డిసెంబర్‌ 26న బాలల దినోత్సవం నిర్వహించాలని కోరారు.

జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతైన నవంబర్‌ 14ను ‘అంకుల్‌ డే’  లేదా ‘చాచా దివస్‌’గా జరపాలని లేఖలో ప్రధానిని కోరారు. గురు గోవింద్‌ సింగ్‌ కుమారుల బలిదానాల స్ఫూర్తిని చిన్నారుల్లో నింపేందుకు డిసెంబర్‌ 26ను బాలల దినోత్సవంగా జరపడం సముచితమని పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు