భారత్‌లో గూగుల్‌ పే బ్యాన్‌? ఎన్‌పీసీఐ క్లారిటీ

27 Jun, 2020 11:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో గూగుల్‌ పే యాప్‌ను ఆర్‌బీఐ బ్యాన్‌ చేసిందంటూ సోషల్‌ మీడియాలో షికార్లు చేస్తున్న పుకార్లపై నేషనల్‌ పేమెంట్స్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ) క్లారిటీ ఇచ్చింది. దీనిపై ఎన్‌పీసీఐ శుక్రవారం స్పందిస్తూ.. గూగుల్‌ పే యాప్‌ను ఇండియాలో బ్యాన్‌ చేయలేదని, సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది.  అంతకు క్రితం గూగుల్‌ పే లావాదేవీలపై వచ్చిన పుకార్లపై సంస్థ స్పష్టత నిచ్చింది. గూగుల్‌ పే యాప్‌ చట్టపరిధిలోనే ఉండి పని చేస్తుందని తేల్చి చెప్పింది. తమ యాప్‌ యూపీఐ ద్వారా చెల్లింపుల కోసం బ్యాంకులకు టెక్నాలజీ సర్వీస్‌ ప్రొవైడర్‌గా వ్యవహరిస్తుందని పేర్కొంది. గూగుల్‌ పే ద్వారా జరిగే ప్రతీ లావాదేవి పూర్తిగా సురక్షితమేనని వెల్లడించింది. ( గూగుల్‌ పే.. కేంద్రానికి హైకోర్టు నోటీసులు)

కాగా, గూగుల్‌ పే థర్డ్‌ పార్టీ యాప్‌ ప్రొవైడర్‌ మాత్రమేనని, ఇది ఎలాంటి పేమెంట్‌ వ్యవస్థను నిర్వహించదని ఆర్‌బీఐ ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. జాతీయ చెల్లింపుల కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐ) ప్రచురించిన అథీకృత చెల్లింపు వ్యవస్థల ఆపరేటర్ల జాబితాలో జీ పే లేదని ఆర్‌బీఐ పేర్కొంది. అయితే గూగుల్‌ పే కార్యకలాపాలు చెల్లింపులు పరిష్కారాల చట్టం 2007ను ఉల్లంఘించడం లేదని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీఎన్‌ పటేల్‌, జస్టిస్‌ ప్రతీక్‌ జలన్‌లతో కూడిన బెంచ్‌కు ఆర్‌బీఐ నివేదించింది.